Sunday, April 28, 2024

పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి ఒంటరిగానే పోటీ చేయనున్నది

- Advertisement -
- Advertisement -

ఏ పార్టీతో జత కట్టే అవసరం బిజెపికి లేదు
శక్తివందన్ వర్క్ షాపుల్లో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఏపార్టీతో జత కట్టదని కేంద్ర మంత్రి,ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన శక్తి వందన్ వర్క్ షాప్‌కు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ భారతీయులు అంటే గతంలో విదేశాల్లో లెక్కచేసేవారు కాదని, కానీ ఇప్పుడు భారత పాస్‌పోర్ట్ ఉంటేనే ప్రపంచవ్యాప్తంగా మంచి గౌరవం దక్కుతోందన్నారు. మాజీ సిఎం కెసిఆర్ కుటుంబం తమ పార్టీపైనా, పార్టీ నేతలపైనా అహంకారంతో ఇష్టారీతిన మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో ఏ నాయకులు కూడా గత పాలకుల కుటుంబం మాదిరి మాట్లాడరన్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 32 జిల్లాలకు జాతీయ రహదారులను అనుసంధానం చేసిందన్నారు. కేంద్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా పాలన నరేంద్ర మోడీ అందిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రంపై భారం మోపిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను ఎలా అమలు చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందని, గత ఎన్నికలు రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరిగాయని, ఇప్పుడు వారం అటు ఇటుగా ఉండవచ్చునని క్యాడరంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన ఇండియా కూటమి అప్పుడే విచ్ఛిన్నమవుతోందని, కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగినట్లు ఆ కుంభకోణాలతో కేంద్రంలో ఆ పార్టీ అధికారానికి దూరమైందన్నారు. కాంగ్రెస్ అవినీతిపై విసిగిపోయిన ప్రజలు బిజెపికి పట్టం కట్టారని, మోడీ నాయకత్వంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. స్వయంగా ప్రధాని వచ్చి వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలను సందర్శించి ధైర్యం చెప్పారన్నారు. మోడీని విమర్శించే స్థాయి విపక్షాలకు లేదని మండిపడ్డారు. ఎలాంటి అవినీతి లేకుండా మోడీ పాలన సాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రాలలో కనీసం రోడ్లు కూడా ఉండేవి కావని ఇప్పుడు జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందన్నారు. కాగా, శక్తి వందన్ వర్క్ షాప్ కార్యక్రమంలో కేంద్రం చేపట్టిన సంక్షేమ పథకాలు, మహిళా రుణాలు, ముద్రా యోజన రుణాలపై అవగాహన కల్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News