Thursday, May 2, 2024

బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా

- Advertisement -
- Advertisement -

1907లో ఇంగ్లాండ్‌లోని బ్రౌన్ సీ ఐలాండ్‌లో స్కౌట్స్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఆ ఉద్యమ పితామహుడు లార్డ్ రాబర్ట్ స్టీవెన్సన్ బెడెన్ పావెల్ ఈ ప్రపంచంలో అడుగిడిన నాటి కంటే నిష్క్రమించే నాటికి దానిని మరింత మెరుగైనదిగా మార్చడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీ నిష్క్రమణ ఆసన్నమైనప్పుడు మీరు సమయాన్ని వృథా చేయలేదు సరికదా మీ వంతు కృషి చేసారన్న తృప్తితో ఈ లోకాన్ని వీడవచ్చు అన్నారు. బహుశా ఆ మాటలను ఆదర్శంగా తీసుకున్నారో లేదో తెలియదు కానీ పద్మశ్రీ అవార్డు గ్రహీత, ‘బ్రిడ్జ్ మ్యాన్’గా ప్రసిద్ధి గాంచిన సామాజిక పారిశ్రామికవేత్త, 73 సంవత్సరాల గిరీష్ భరద్వాజ్ ఆగష్టు 1989లో ప్రారంభించి గత 34 సంవత్సరాలుగా సుదూర ప్రాంతాలలో, ప్రత్యేకించి దక్షిణ భారత దేశంలోని కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలోని వివిధ వాగులు, నదుల మీదుగా దాదాపు 139 తక్కువ ఖర్చుతో వేలాడే వంతెన (Suspension Foot Bridge) లను నిర్మించడం ద్వారా మారుమూల ప్రాంతాలను సమీప పట్టణాలు, నగరాలతో అనుసంధానించి గ్రామీణ ప్రజలకు గొప్ప మేలు చేశారు.

మే 12, 1950న బి కృష్ణ భట్, లక్ష్మిఅమ్మ దంపతులకు జన్మించిన గిరీష్ భరద్వాజ్ 1973లో పిఇఎస్ ఇంజినీరింగ్ కాలేజ్, మాండ్యా నుండి మెకానికల్ ఇంజినీరింగ్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన తరువాత తన తండ్రి సలహా మేరకు ఆగ్రో సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించి స్థానిక రైతుల వ్యవసాయ పనిముట్ల మరమ్మత్తులు చేసేవాడు. తరువాత 1975లో, అతను సుల్లియాలో తన స్వంత ‘రేషనల్ ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్’ ని స్థాపించాడు. అది ఇప్పుడు వ్యవసాయ యంత్రాల మరమ్మత్తులతో పాటు గోబర్ గ్యాస్ ప్లాంట్‌ల నిర్మాణంలో నిమగ్నమై అయాశిల్ప అన్న పేరుతో ప్రాచుర్యం పొందింది.అటవీ అధికారి నారాయణ్ సుల్లియానుండి కుశాల్‌నగర్‌కు బదిలీ కావడంతో ఆయన గిరీష్ భరద్వాజ్‌ను ‘కావేరిలోని ఒక ద్వీపాన్ని (నిసర్గ ధామ్) ప్రధాన భూభాగానికి అనుసంధానించగలరా?’ అని అడిగాడు. ఇది 50 మీటర్ల విస్తీర్ణంతో రెండు వైపులా పెద్ద చెట్లు కలిగి ఉన్న ప్రాంతం. అందుకు సరేనన్న లక్ష్మణ్ జూలాను సందర్శించిన ఒక స్నేహితుడి సహాయంతో ఎలాంటి డిజైన్ లేకుండా కేవలం ఉక్కు కడ్డీలు, తాళ్ళతో చెక్క పలకల మార్గాన్ని సస్పెండర్లుగా వేలాడదీయడానికి ఏర్పాటు చేశాడు. కొంత సమయం తీసుకుని సస్పెన్షన్ ఫుట్‌బ్రిడ్జ్‌ని నిర్మించాలని నిశ్చయించుకున్న ఆయన అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో తీరం, పసిఫిక్ మహాసముద్రాన్ని కలిపే ఒక- మైలు -వెడల్పు జలసంధి, గోల్డెన్ గేట్‌పై విస్తరించి ఉన్న సస్పెన్షన్ వంతెన గోల్డెన్ గేట్ వంతెన, జపాన్‌కు చెందిన అకాషి కైక్యో సాంకేతికతలను అధ్యయనం చేయడం ద్వారా ప్రేరణ పొందారు. తక్కువ ఖర్చుతో వంతెనను నిర్మించడానికి ఆయన గ్రామస్థుల నుండి విరాళాలు సేకరించారు. నిర్మాణ సమయంలో 40 మంది గ్రామస్థులు స్వచ్ఛందంగా ఆయనకు సహాయపడగా స్థానిక మహిళలు తమ వంతు సహకారం అందించారు. ఆయన కృషి ఫలించి ఆగస్టు 1989లో మూడు అడుగుల వెడల్పుతో స్వీయ -రూపకల్పనతో తయారైన మొట్ట మొదటి సస్పెన్షన్ ఫుట్‌బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో స్థానికులకు ఆయన ఒక హీరో అయ్యాడు. అంతేకాక గిరీష్ కన్నడ మాధ్యమంలో నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించే స్నేహ ఎడ్యుకేషన్ సొసైటీ ఆఫ్ సుల్లియా వ్యవస్థాపక- కార్యదర్శి. సామాజిక సేవతోపాటు ఆయన మంచి ఈతగాడు కూడా. పిన్న వయసులోనే అలలకు ఎదురుగా ఈదడం నేర్చుకున్న ఆయన 1972లో కళాశాల ఛాంపియన్‌గా అవార్డు సాధించారు.

మంగళూరు సమీపంలో గల సుల్లియా తాలూకాలోని గిరీష్ స్వగ్రామమైన ఆరంబూర్ ప్రజలు పయస్విని నదిని దాటడానికి ఒక దేశీయ పడవపై ఆధారపడేవారు. అయితే ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వచ్చే వరదల కారణంగా దేశీయ పడవపై నది దాటలేక ఉపాధి కోల్పోయేవారు.కానీ ఒకే ఒక్క పడవ అడుగున రంధ్రం ఏర్పడినప్పుడల్లా దానికి మరమ్మత్తు చేసే వరకు లేదా కొత్త పడవ నిర్మించే వరకు గ్రామస్థుల జీవనం స్తంభించిపోయేది. దీంతో విసుగు చెందిన గ్రామస్థులు 1989లో తమ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నా రు. అందుకు విరుగుడు వంతెన నిర్మాణమని తెలిసినప్పటికీ అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఎవ్వరూ ముందుకు వచ్చేవారు కాదు. అయితే మెకానికల్ ఇంజినీర్‌గా సమస్యకు ఏదైనా పరిష్కారం చూపగలడేమో అన్నఆశతో వారు ఆయనవైపు చూడడంతో వారి ఆశలను వమ్ము చేయలేకపోయిన ఆయన తన మిత్రుల సహాయంతో కేవలం మూడు నెలల్లో లక్ష రూపాయల వ్యయంతో 97 మీటర్ల సస్పెన్షన్ ఫుట్‌బ్రిడ్జిని నిర్మించి అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపారు. ఆగస్టు1989 ప్రారంభమైన ఆయన ప్రస్థానం అక్కడితోనే ఆగిపోలేదు. ఇప్పటివరకు ఆయన దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో 32 నదుల మీదుగా 147 అలాంటి వంతెనలను నిర్మించి గ్రామీ ణ ప్రాంతాలలోని ప్రజలకు తనదైన శైలిలో సేవ చేస్తున్నారు. ఈ సేవా దృక్పథమే ఆయనకు బ్రిడ్జి మ్యాన్ ఆఫ్ ఇండియా లేదా సేతు బంధు అనే పేరును ఆర్జించి పెట్టింది. తన స్వగ్రామం ఆరంబూర్ ప్రజల కష్టాలే తనలో దేశ వ్యాప్తంగా తక్కువ ఖర్చు తో గ్రామీణ ప్రాంతాలో సస్పెన్షన్ ఫుట్ బ్రిడ్జిలు నిర్మించాలన్న ఆలోచనకు నాంది పలికింది అంటారాయన. ఈ నిర్మాణాలను సంప్రదాయక బ్రిడ్జిల నిర్మాణ వ్యయంలో కేవలం పదో వంతు తో మూడు నెలల సమయంలో నాణ్యతా ప్రమాణాలను పాటి స్తూ పూర్తి చేయడం ఆయన ప్రత్యేకత. ఆయన చేపట్టే అత్యధిక శాతం వంతెనలు ప్రభుత్వ ప్రాయోజితమైనవి అయితే, కొన్ని గ్రామస్థుల సొంత నిధులతో నిర్మించబడ్డాయి. అటువంటి ప్రాజెక్ట్‌ల కోసం అతను తన సేవలను ఉచితంగా అందిస్తాడు. కొన్ని సందర్భాల్లో నిధుల కొరతతో ప్రాజెక్టు పూర్తి చేయలేని పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఆయన తన సొంత డబ్బు ఖర్చు చేసి ప్రాజెక్టు పూర్తి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం ఆయన చేస్తున్న నిరుపమాన సేవలకుగాను ఆయన అనేక పురస్కారాలు అందుకున్నారు. అందులో కర్ణాటక అత్యుత్తమ యువకుడు -1988 పురస్కారం, హోంగార్డ్‌లో రెండు బంగారు పతకాలు, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు, 2011లో దక్షిణ కన్నడ జిల్లా రాజ్యోత్సవ అవార్డు, సిఎన్‌ఎస్, ఐబిఎన్ ఛానెల్ ద్వారా బి ది ఛేంజ్ సి జె అవార్డు, రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ ద్వారా పీస్ త్రూ సర్వీసెస్ అవార్డు, సువర్ణ మీడియా నెట్‌వర్క్ ద్వారా ‘అసామాన్య కన్నడిగ’ అవార్డు, 2017లో కేంద్ర ప్రభుత్వం ద్వారా సామాజిక సేవ విభాగంలో భాగంగా అందించే అత్యుత్తమ పౌర పురస్కారం పద్మశ్రీ, 2021లో డాక్టర్ శివరామ కారంత్ హుటూర పురస్కారం అందుకున్నారు.ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్న సమయంలో మానవత్వం కంటే విలువైన సేవ ఏదీ లేదు. జీవితంలో అత్యంత ముఖ్యమైనది మానవత్వం, ప్రేమ అనడం ఆయన సేవా నిరతికి నిదర్శనం. దురదృష్టవశాత్తు మన దేశంలోని గ్రామీణ ప్రాంతాలలోని ఎందరో ప్రతిభావంతులు గుర్తింపుకి నోచుకోరు అని ఆయన విచారం వ్యక్తం చేశారు. 1980వ దశకంలో మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో తనఅనుభవాన్ని గుర్తుచేసుకుంటూ జీవితంలో క్రూరంగా మారిన ఏ వ్యక్తినైనా ప్రేమ, ఆప్యాయత ద్వారా సమాజంలోని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావచ్చు అని అన్నారు.

2007లో వరంగల్ జిల్లా లక్నవరం గ్రామంలో ఒక పెద్ద సరస్సు మీదుగా సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణ సమయంలో సంభవించిన సంఘటనను గుర్తుచేసుకుంటూ ఆయన సమాజంలో ఎవరినీ అంటరానివారిగా పరిగణించకూడదు అంటారు. ఆ సమయంలో పూర్తిగా నక్సలైట్ల ఆధిపత్యంలో ఉన్న ఆ ప్రాంతంలో తన ప్రణాళికను విరమించుకోవలసిందిగా గిరీష్‌ను వారు హెచ్చరించినప్పటికీ వారి బెదిరింపులకు లొంగక ఆయన కేవలం 4 నెలల కంటే తక్కువ వ్యవధిలో ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి విజయం సాధించాడు. ఆయన చిత్తశుద్ధితో చేపట్టిన ఆ ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతానికి చేకూరిన లబ్ధిని చూసి ఆశ్చర్యచకితులైన స్థానిక ప్రజలతో పాటు నక్సలైట్లు సైతం చెమర్చిన కళ్ళతో గిరీష్ కాళ్లపైపడి తమ కృతజ్ఞతలు తెలిపారు. స్నేహం, ప్రేమ, పరస్పర గౌరవం ద్వారా ‘సమాజానికి ముప్పుగా భావించే సాయుధ తీవ్రవాదుల’ హృదయాలను గెలుచుకోవడం జీవితంలో తాను సాధించిన గొప్ప విజయాలలో ఒకటి అంటారు గిరీష్. సమాజాభివృద్ధికి అవరోధంగా నిలుస్తున్న వారి ఆలోచనలను తన కృషితో ప్రభావితం చేసి జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం శ్లాఘనీయం.

గిరీష్ 1984 నుండి 2008 వరకు రాష్ట్ర హోంగార్డ్ శాఖలో పని చేసారు. ఈ సమయంలో ఆ శాఖలోని సిబ్బంది, అధికారులకు ప్రథమ చికిత్స, ఇతర శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేవారు. ఈ రెండు విభాగాలలో ఆయన ప్రదర్శించిన అద్వితీయమైన ప్రతిభకు గుర్తింపుగా ఆయన రెండు స్వర్ణపతకాలు అందుకున్నారు. ఆ తరువాత ఆయన ఢిల్లీలో అగ్నిమాపక దళంలో శిక్షణ పొంది ఆవిభాగాధిపతిగా పదోన్నతి పొందారు. పుత్తూర్ ఇండస్ట్రియల్ యూనియన్ డైరెక్టర్‌గా,స్మాల్ ఇండస్ట్రీస్ బ్యాంక్, స్నేహ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, వివేకానంద ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌లకు కూడా ఆయన సేవలందించారు. అంతేకాక ఆయన రోటరీ క్లబ్‌తో కూడా మూడు దశాబ్దాలకు పైగా అవినాభావ సంబంధం కొనసాగించారు. పేద గ్రామస్థులకు సాధికారత కల్పించేందుకు, వారిని అవకాశాల ప్రపంచానికి అనుసంధానం చేసేందుకు తాను చేపట్టిన ‘సేతు బంధు’ కార్యక్రమాన్ని గుర్తించి స్వచ్ఛ భారత్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీ నుంచి వ్యక్తిగత లేఖ అందుకోవడం తనకు అత్యంత ఆనందానిచ్చిందని భరద్వాజ్ అంటారు. గిరీష్ భరద్వాజ్ సాధించిన విజయాలను తెలుసుకున్న స్విట్జర్లాండ్ దేశస్థుడు టోనీతో సహా శ్రీలంకలోని కొందరు ఆయనను తమ దేశంలో కూడా మన దేశంలో అమర్చినటువంటి సస్పెన్షన్ ఫుట్ బ్రిడ్జిలను నిర్మించవలసిందిగా ఆహ్వానించారు. వీరే కాకుండా ఇతర దేశాలలోని మరి కొందరు కూడా గిరీష్ ప్రాజెక్టులపై తమ ఆసక్తిని కనబర్చడం గమనార్హం.‘పేద దేశాల్లో సస్పెన్షన్ బ్రిడ్జిలు నిర్మించే స్విట్జర్లాండ్‌కు చెందిన టోనీ, గిరీష్ పనులను ప్రత్యక్షంగా చూసి అతని కృషిని మెచ్చుకుని బ్రిడ్జ్ బ్రదర్ అని పిలుస్తాడు. మానవత్వాన్ని తమ మతంగా చేసుకుని మంచిని సమాజోద్ధారణ కోసం పరిశ్రమించే గిరీష్ భరద్వాజ్ లాంటి వ్యక్తులను గౌరవించుకోవడం సమాజం యొక్క విధి.

-యేచన్ చంద్ర శేఖర్,
8885050822

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News