Sunday, April 28, 2024

బిఆర్‌ఎస్ బిగ్ బ్రదర్

- Advertisement -
- Advertisement -

అన్నీ తానై వ్యవహరించిన కెటిఆర్,  60 రోజులు ప్రచారం.. 70 రోడ్ షోలు
30 పబ్లిక్ మీటింగ్స్, వివిధ వర్గాలతో సమావేశాలు,  30కి పైగా ప్రత్యేక ఇంటర్వ్యూలు,  150కి పైగా టెలికాన్ఫరెన్స్‌లు

గత 60 రోజులుగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు పార్టీ తరఫున అన్నీ తానై ముందుకు నడిపించారు. ఒకవైపు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కెసిఆర్ తర్వాత అత్యధిక సభలు, రోడ్ షోలు, ర్యాలీలలో పాల్గొన్న కెటిఆర్, మరోవైపు పార్టీ ప్రచార ప్రణాళికల నుంచి మొదలుకొని క్షేత్రస్థాయి సమన్వయం వరకు విస్తృతంగా పనిచేశారు. ఎన్నికల షెడ్యూల్‌కి ముందే మంత్రి హోదాలో దాదాపు 30 నియోజకవర్గాలు విస్తృతంగా పర్యటించి గత పది సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించిన మంత్రి కెటిఆర్, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అటువైపు ప్రభుత్వ పనితీరు, పదేళ్ల అభివృద్ధి ప్రస్థానాన్ని సమర్థంగా వివరిస్తూనే ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బిజెపిల పైన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. గత 60 రోజుల నుంచి మరింత విస్తృతంగా పర్యటించి రాష్ట్రం నలుమూలలా జరిగిన భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు.

ఆకట్టుకున్న కెటిఆర్ ప్రసంగాలు
కెటిఆర్ తన పదునైన ప్రసంగాలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు, యువత, విద్యావంతులను ఆలోచింపజేసేలా సాగిన కెటిఆర్ ప్రసంగాలు సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున వైరల్ అయ్యాయి. అలాగే అత్యంత కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతను తన భుజాలపై మోసి.. ప్రతి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం రెండు రోడ్ షోలతో పాటు ఎల్‌బినగర్, శేర్‌లింగంపల్లి, మల్కాజ్‌గిరి వంటి పెద్ద నియోజకవర్గాల్లో ఒకే రోజు నాలుగు నుంచి ఐదు రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రతి రోడ్ షోలో అడుగడుగునా ప్రజాభిమానం వెల్లువెత్తింది.

అడుగడుగునా జనప్రభంజనం కనిపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాల్లో వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించి ఆ తర్వాత సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు హైదరాబాదులో తన ప్రచార కార్యక్రమాలను కొనసాగించారు. ఒకవైపు జయప్రకాష్ నారాయణ (జెపి), గోరేటి వెంకన్న, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారితో ప్రత్యేక ఇంటర్వ్యూలు కొనసాగించిన కెటిఆర్ ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువకులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోవడంతోపాటు.. ప్రభుత్వ నియామక ప్రక్రియను శరవేగంగా పూర్తిచేసేందుకు చేపట్టిన పటిష్టమైన చర్యల గురించి వివరించారు. అలాగే ఓలా ఊబర్, జొమాటో వంటి యాప్‌ల ద్వారా సేవలు అందిస్తున్న గిగ్ వర్క్ చేస్తున్న యువకుల దాకా అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ వారితో సంభాషిస్తూ వారికి భరోసానిస్తూ ముందుకు సాగారు.

దీంతో పాటు హైదరాబాదులో ఫస్ట్ టైం ఓటర్లు, ఐటీ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు వంటి వివిధ వర్గాల ప్రముఖులు, ఉద్యోగులు, ప్రజలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. సమాజంలో సగభాగమైన మహిళలతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం మరోసారి గెలిచిన తర్వాత మహిళల కోసం చేపట్టే అనేక కార్యక్రమాలపైన తన ఆలోచనలను పంచుకున్నారు. దీంతోపాటు అటు పలు కుల సంఘాల నాయకులు ప్రతినిధులతో మాట్లాడుతూనే మైనార్టీలతో ప్రత్యేకంగా సమావేశమై గత పది సంవత్సరాలలో ఆయా వర్గానికి జరిగిన లబ్ధిని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ భవిష్యత్తు ప్రణాళికలను ఆవిష్కరిస్తూ.. వారిలో కొండంత భరోసాను నింపారు.

భవిష్యత్ విజన్ ఆవిష్కరణ
కేవలం ప్రచార కార్యక్రమాలే కాకుండా పార్టీ చేపట్టాల్సిన పత్రిక ప్రకటనల నుంచి మొదలుకొని సామాజిక మాధ్యమాలలో రూపొందించాల్సి న కంటెంట్ వరకు విస్తృతంగా చర్చించి కెటిఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. మొత్తం 60 రోజుల పార్టీ ప్రచారంలో అత్యంత హుందాగా పార్టీ ప్రచారాన్ని చేపట్టారు. ఓవైపు ప్రతిపక్ష పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేసినా, కేవలం పాజిటివ్ అంశాలే ఈ ఎన్నికల ఎజెండా కావాలన్న సానుకూల ఆలోచనతో.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో.. ఆ మేరకు మొత్తం క్షేత్రస్థాయి నుంచి కేంద్ర పార్టీ కార్యాలయం వరకు పూర్తి సమన్వయంతో ప్రచారపర్వంలో ప్రత్యర్థులకు అందనంత వేగంగా బిఆర్‌ఎస్ దూసుకెళ్లింది.

దీంతోపాటు ప్రతిరోజు వేలాది మందితో కెటిఆర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఒకవైపు పార్టీ ఎంఎల్‌ఎ అభ్యర్థులు, పార్టీ నియమించిన ఇంఛార్జ్‌లు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన వార్‌రూమ్ ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు టెలి కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. వీరితోపాటు పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలతో, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఒపీనియన్ మేకర్లు, ముఖ్యమైన వ్యక్తులతోనూ టెలికాన్ఫరెన్స్ ద్వారా సంభాషించి పార్టీ కోసం వారి మద్దతును కూడగట్టారు. మంత్రి కెటిఆర్ తన ప్రచార సభలు, సమావేశాల్లోనూ తన ప్రసంగాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు.

కలిసి ముందడుగు వేద్దామంటూ పిలుపు
అందరం కలిసి సాధించుకున్న తెలంగాణలో కలిసి ముందడుగు వేద్దామని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే ఎన్నో అంశాల్లో గొప్ప ప్రగతిని సాధించాం.. అని వివరిస్తూనే.. ఇంకా సాధించాల్సింది ఇంకా ఉందని భవిష్యత్ విజన్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ ఎవరి చేతిలో ఉంటే పదిలంగా ఉంటుందో ఆలోచించి ఓటువేయాలని కెటిఆర్ ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఒక పాజిటివ్ దృక్పథంతో ప్రజల్లో సానుకూల అభివృద్ధి ఎజెండాతో సాగిన ప్రచారపర్వమంతా ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. ఒకవైపు తెల ంగాణ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి మా త్రమే అని గణాంకాలతో సహా వివరించారు. ప్రతిపక్షాల తప్పులు, వారి డొల్ల వాదనలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. కాంగ్రెస్ మూడు గంటల కరెంటు చాలని, వ్యవసాయానికి 10 హెచ్.పి మోటర్లను బిగించాలని రైతు నడ్డివిరిచే చర్యలపై విరుచుకుపడ్డారు.

కర్ణాటకలో కాంగ్రెస్ వంచించిందో ఉదాహరణలతో వివరణ
కర్ణాటకలో అడ్డగోలు హామీలిచ్చి ఏవిధంగా అక్కడి ప్రజల్ని కాంగ్రెస్ వంచించిందో కెటిఆర్ ఉదాహరణలతో సహా వివరించారు. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల వైఫల్యాలు, తెలంగాణ రాష్ట్రానికి చేసిన తీవ్ర అన్యాయాలను ప్రజలకు మరోసారి గుర్తు చేశారు. నిన్న అయినా, నేడు అయినా, రేపు అయినా తెలంగాణకు నంబర్‌వన్ విలన్ కాంగ్రెస్ మాత్రమేనని, దశాబ్దాల పాటు దగాచేసిన ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో మరోసారి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రోజుకి 15-18 గంటల వరకు పని
సమైక్యరాష్ట్రంలో 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని తెలంగాణ కేవలం పదేళ్ల కాలంలోనే సాధించిందని, ఇది విజన్ ఉన్న నాయకత్వం ఉండటం వల్లే సాధ్యమైందని కెటిఆర్ అడుగడుగునా గుర్తుచేశారు. బుడిబుడి అడుగుల వయసులోనే బుల్లెట్ వేగంతో దూసుకెళ్లిన తెలంగాణ ప్రస్థానం మరింత ముందుకు సాగాలంటే.. బిఆర్‌ఎస్‌తోనే సాధ్యమని వివరించారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉంది కాబట్టి.. సంక్షేమాన్ని దీవించి.. అభివృద్ధికి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఆత్మ తెలిసిన కెసిఆర్‌కు మూడోసారి విజయాన్ని అందించి దక్షిణ భారతదేశంలోని హ్యాట్రిక్ సాధించిన తొలి ముఖ్యమంత్రిగా సరికొత్త రికార్డు సాధించేందుకు నడుం కట్టాలని పిలుపునిచ్చారు.

మొత్తంగా గత 60 రోజులపాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ పార్టీకి అన్నీ తానై, స్టార్ క్యాంపెయినర్‌గా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అన్ని బాధ్యతలు తన భుజాలపైకి ఎత్తుకొని రోజుకి దాదాపు 15 నుంచి -18 గంటల వరకు కెటిఆర్ పనిచేశారు. ముఖ్యంగా ప్రజల నుంచి లభించిన అపూర్వ స్పందనే తనను ముందుకు నడిపించిందని, ప్రజలకు మంచి చేస్తే, వారు అండగా ఉంటారన్న బలమైన నమ్మకంతో తన క్యాంపెయిన్ సాగిందని, భారత రాష్ట్ర సమితిని మరోసారి ప్రజలు గెలిపిస్తారన్న పూర్తి విశ్వాసం తనకుందని కెటిఆర్ అన్నారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో, 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో తమ వెంట నడిచిన తెలంగాణ సమాజం వచ్చే ఎన్నికల్లోనూ బిఆర్‌ఎస్ పార్టీని గుండెల నిండా ఆశీర్వదించాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.

(ఎం.భుజేందర్/మన తెలంగాణ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News