కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లోని మల్లయ్యపల్లి గ్రామ శివారులో నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా పోచారం కాలువపై నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి గుంతలో బుధవారం రాత్రి 10:30 ప్రాంతంలో ప్రమాదవశాత్తు కారు పడడంతో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పాపన్నపేట మండలం నర్సింగ్ రావు పల్లి తండాకు చెందిన పీరియ (38), డ్రైవర్, పీరియా (32) ప్రమాదంలో అక్కడికక్కడే మృత్యుపాలయ్యారు. సోను, వెన్ను, ప్రవీణ్ లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నర్సింగరావుపల్లి నుంచి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, డ్రైవర్తో కలిసిపెద్దగుట్టకు బుధవారం రాత్రి బయలుదేరారు.
నేషనల్ హైవే రోడ్డు నిర్మాణంలో భాగంగా సదరు కాంట్రాక్టర్ పోచారం కాల్వపై బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. వాహనాల రాకపోకలకు కాలువలో మట్టిని పోసి దారిని చేశారు. కాగా కారు ప్రమాదవశాత్తు పైనుంచి పది ఫీట్లకు పైగా ఉన్న గుంతలో వెల్లకిలో పడింది. కారు కిందపడడంతోనే పై టాప్ ఒత్తుకపోవడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి ప్రభుత్వ అంబులెన్స్లో తరలించారు. విషయం తెలిసిన మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలివచ్చారు. గాయపడిన ముగ్గురికి ప్రధమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం మెదక్ జిల్లా కేంద్రం ఆసుపత్రికి కుటుంబీకులు తరలించారు. స్థానిక ఎస్సై బొజ్జ మహేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.