హైదరాబాద్: వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి)లో జరిగిన అవకతవకలు, అధికార దుర్వినియోగంపై సిబి సిఐడి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారధి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు డిజిపి (సిఐడి) ఈ కేసు విచారించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వరంగల్ డిసిసిబిలో బంగారం తాకట్టు లేకుండానే రుణాలు ఇవ్వడంతో పాటు నిధులు దుర్వినియోగమైనట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి.
దీంతో 2017లో వరంగల్ డిసిసిబిలో అక్రమాలు జరుగుతున్నాయని స్థానిక ఎంఎల్ఎలు సిఎం కెసిఆర్కు ఫిర్యాదు చేయడంతో సహకార శాఖ అదనపు రిజిస్ట్రార్ విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని, దాదాపు రూ. 9 కోట్ల వరకు నిధులు దుర్వినియోగమైనట్లు పేర్కొన్నారు. ఇందులో రూ. 7 కోట్లు బ్యాంకు క్యాష్ను అక్రమంగా వాడినట్లు తెలిసింది.ఈ నేపథ్యంలో డిసిసిబి పాలకవర్గాన్ని రద్దు చేయాలని నివేదికలో సూచించారు. పరిశీలించిన ప్రభుత్వం డిసిసిబి కమిటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ట్రిబ్యునల్ కూడా కోర్టు రద్దు నిర్ణయాన్ని సమర్థించింది. ఇప్పుడు తాజాగా అసలు అక్రమార్కులు ఎవరో తేల్చడంతో పాటు, నిధుల రికవరీ చేపట్టేందుకు సిబి సిఐడి విచారణకు ప్రభుత్వం అప్పగించింది.