న్యూఢిల్లీ : వివాదాస్పద దైవస్వరూపుడుగా చెప్పుకునే నిత్యానంద ఆచూకీ రాబట్టుకోడానికి గుజరాత్ పోలీస్ల అభ్యర్థనపై ఇంటర్పోల్ బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది. పిల్లలను తప్పు దారి నడిపించడం, అమ్మాయిలతో లైంగిక కార్యకలాపాలు సాగించడం తదితర నేరారోపణలు ఎదుర్కొన్న నిత్యానంద గత ఏడాది భారత్ విడిచిపెట్టి పరారయ్యాడు. అహ్మదాబాద్ లోని నిత్యానంద అశ్రమం నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యం కావడంపై గుజరాత్ పోలీసులు నిత్యానందపై కేసు నమోదు చేశారు. పిల్లలను కిడ్నాప్ చేయడం, పిల్లలచే విరాళాలు వసూలు చేయించడం తదితర నేరాలు ఆయనపై నమోదు అయ్యాయి.
దాంతో గుజరాత్ పోలీసులు ‘వాంటెడ్’ వ్యక్తిగా ప్రకటించారు. పోలీసులు ఆయన ఆచూకీ కోసం గాలిస్తుండగా, గత ఏడాది డిసెంబర్లో నిత్యానంద ఈక్వెడార్ సమీపాన హిందూ దేశాన్ని నిర్మించినట్టు, దానికి కైలాసం అని పేరు పెట్టినట్టు నిత్యానంద వీడియోలో వెల్లడించారు. అయితే ఈక్వెడార్ మాత్రం అవన్నీ నిజం కావని నిత్యానంద తమ దేశంలో లేడని వివరించింది. ఈ నేపథ్యంలో గుజరాత్ పోలీస్లు ఇంటర్పోల్ను ఆశ్రయించారు. రెడ్కార్నర్ నోటీస్ జారీ అయ్యేలా ప్రయత్నిస్తున్నామని గుజరాత్ పోలీసులు చెప్పారు.
Interpol notice issued for Nithyananda