మార్చి 1, 2027 నుండి జరిగే జనగణనతోపాటు కులగణన చేపట్టెందుకు కేంద్రం అంగీకరించింది. భారతదేశంలో కులగణన చేపట్టాలని చాలా కాలంనుండి, వివిధ వర్గాలనుండి బిసి సంఘాల డిమాండు వస్తున్నప్పటికీ కేంద్రం ఎస్సి, ఎస్టి వరకు మాత్రమే జనగణనలో చేర్చటం జరిగింది. ఇప్పుడు ఎత్తులు పైఎత్తులతో నిర్ణయాలు తీసుకోవటం రాజకీయాల్లో సహజం. కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇలాగే అర్థం చేసుకోవచ్చు. ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. హిందూ సమాజ ఏకీకరణకు, హిందూ సంస్కృతిపై ఆధారపడే జాతీయవాదానికి కులభావాలు, మమకారాలు అడ్డంకిగా ఉన్నాయన్నది సంఘ్ పరివార్ సైద్ధాంతిక అవగాహనగా ఇప్పటివరకు చలామణి అయింది. అందుకే కాంగ్రెస్ వైపు నుండి కులగణనకు సంబంధించి ఎన్ని సవాళ్లు ఎదురైనా బిజెపి నుంచి గాని, ఆర్ఎస్ఎస్ నుంచి గాని తమ విధానం ఇది అంటూ స్పష్టమైన ప్రకటనలు రాలేదు.
కులగణనకు నెహ్రూ వ్యతిరేకమంటూ బిజెపి వైపు నుంచి చాలా వ్యాఖ్యానాలు వచ్చాయి. రిజర్వేషన్లను రాజీవ్ గాంధీ లోక్సభలోని వ్యతిరేకించారంటూ (opposed Lok Sabha) విమర్శలు కురిపించారు. మండల్ కమిషన్ సిఫార్సులను ఇందిరా గాంధీయే తొక్కిపెట్టారని ఆరోపణలు ఎక్కుపెట్టారు. సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా సమయ, సందర్భాలను బట్టి అలాంటి ప్రకటనలు చేయలేదని చెప్పలేం. 2011లో జనగణనతోపాటు కులగణన చేస్తామని ఆనాడు కాంగ్రెస్ ప్రకటించి, ఆ తర్వాత సామాజిక, ఆర్థిక, కులగణన చేస్తామని చెప్పి, కులగణనను పక్కకు పెట్టింది. ఒకప్పటి విధానాలకు భిన్నంగా కులగణనను ప్రధాన రాజకీయ అజెండాగా మలుచుకుని నాలుగేళ్ల నుంచి కాంగ్రెసు పార్టీ కార్యాచరణ అంతా దాని చుట్టూనే తిప్పుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో బిజెపి సొంతంగా ఆధిక్యతను సాధించకుండా చేయడంలో కాంగ్రెస్ ప్రచారం బాగానే తోడ్పడింది.
మోడీ కోరినట్లుగా 400 లోక్సభ స్థానాలను కట్టబెడితే రిజర్వేషన్లను బిజెపి రద్దు చేస్తుందని కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్రచారానికి ఉధృతిని ఉరవడిని తీసుకొచ్చారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా, ఎంతో పకడ్బందీగా తెలంగాణలో కులగణనను విజయవంతంగా పూర్తి చేశామని, దాన్ని మోడీ విమర్శించలేరని రేవంత్ రెడ్డి ఒకటికి పదిసార్లు చెప్పారు.ఒక రకంగా ఇప్పుడు అదే నిజమైంది. అయితే కాంగ్రెస్ ఎక్కుపెట్టిన కులగణన అస్త్రం భవిష్యత్తులో రాజకీయంగా మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా దీన్ని ఒడుపుగా అందుకొని తనకు ఉపకరించే రీతిలో ప్రయోగించుకోవటానికి బిజెపి సిద్ధమైంది. దీంతో ఎంతవరకు సఫలం అవుతుందో ఇప్పుడే చెప్పలేం. కానీ కులగణనపై కాంగ్రెస్ అనుకున్నంత స్థాయిలో రాజకీయంగా మరింత విజృంభించకుండా బిజెపి పావులు కదిపిందని అర్థం.
వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ కుల జనాభాను ఎలా సేకరిస్తారు అన్న దానిపైనే భవిష్యత్తు ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కులంతోపాటు ఉద్యోగ, విద్య, ఆస్తుల వివరాలను పక్కగా సేకరించి వాటిని బహిరంగపరిస్తే రాజకీయ రంగమే చాలా ఒడిదుడుకులకు లోను కావాల్సి వస్తుంది. కుల జనాభాను బట్టి ఉద్యోగాలు, పదవులు ఉండాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. అందుకోసం రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు విధించిన 50% పరిమితిని ఎత్తివేయాలని గట్టిగా కోరుతున్నది. నిజానికి కాంగ్రెసుతోపాటు ప్రాంతీయ పార్టీలు కూడా అదే డిమాండ్ను ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. తెలంగాణలో చేపట్టిన కులగణనతో బిజెపి వర్గాలలో ప్రకంపనలు మొదలైనవి. 2027 మార్చి 1వ తేదీనుంచి చేపట్టే జనాభా లెక్కల సేకరణలో అంతర్భాగంగా కులాలవారీగా జనాభా గణాంకాలు కూడా సేకరించాలని నిర్ణయించడం దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈసారి రెండు దశల్లో జనగణన నిర్వహిస్తున్నారు.
ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 16 న గజిట్ విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. భారతదేశంలో జనాభా లెక్కలను మొదటిసారిగా బ్రిటిష్ కాలంలో 1872లో చేపట్టడం జరిగింది. ఆ తర్వాత 1881 నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దేశజనాభాను లెక్కించడం జరుగుతున్నది. మన దేశంలో జనాభా పెరుగుదల రేటు ఏకరీతిగా కనపడదు. 1901 నుండి 1921 మధ్య కాలంలో జనాభా వార్షిక పెరుగుదల రేటు కేవలం 0.2 శాతం మాత్రం ఉండగా, 1921- 51 మధ్యకాలంలో 1.2 శాతానికి పెరగడం జరిగింది. ఇక 1951- 81 కాలంలో 2.3 శాతంగా ఉన్న వార్షిక పెరుగుదల రేటు వల్ల 32 కోట్ల జనాభా అదనంగా పెరిగింది. 1951లో 36 కోట్ల ఉన్న దేశజనాభా 2001 నాటికి 102 కోట్లకు పెరగడాన్ని బట్టి మన దేశంలో 1.9 శాతం ఉన్నది. అయితే 1981 నుండి మాత్రం జనాభా పెరుగుదల రేటు తగ్గుతూ వస్తుండడం ఒక రకంగా శుభపరిణామమే.
కానీ, అధిక జనాభా కలిగి ఉన్న మధ్య భారత రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల సమస్య తీవ్రతను గ్రహించాలి. 2021లో జనగణన నిర్వహించాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా వేశారు. ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత జనగణన జరుగుతున్నది. ఈసారి జరిగే జనగణనకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. కులాల జనాభా లెక్కలు కూడా సేకరించబోతున్నారు. కులగణన కోసం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తోపాటు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కులసంఘాలు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి పెంచారు. ఇప్పటికే బీహార్, తెలంగాణలో రాష్ట్రప్రభుత్వాలు సొంతంగా కులగణన నిర్వహించాయి. దీంతో దేశమంతటా ఈ ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.
కులగణన వివరాల ఆధారంగానే ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తే ఆ వర్గాలకు మేలు జరుగుతుందని మేధావులు, నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్రం కులగణనకు ఆమోదం తెలిపింది. కులగణన సేకరణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదా: తెలంగాణలో 134 కులాలు బిసి లిస్టులో ఉన్నాయి. కానీ కేంద్ర ఒబిసి లిస్టులో 86 కులాలు మాత్రమే ఉన్నాయి. సెన్సెస్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1948 ద్వారా సెన్సెస్ జరుగుతున్నది. ఇప్పుడు అన్ని మతాలలోని కులాల జనగణన జరుగుతున్నది. కాబట్టి ఆ సెన్సెస్ చట్టాన్ని కూడా అవసరమైన మేరకు సవరించాలి. సమగ్రంగా పారదర్శక విధానాలతో కులగణన చేపట్టాలి. ఈ కులగణన ద్వారా సామాజిక, ఆర్థిక అవసరమైతే రాజకీయ అంశాలను లెక్కించి రాబోయే కాలంలో తగు విధాన నిర్ణయాలు, ప్రణాళికలు రచించి మానవాభివృద్ధి సూచికలలో ముఖ్యంగా విద్య, ఆరోగ్యాలలో ఘన స్థానాన్ని మెరుగుపరచుకోవచ్చు.
- ఉజ్జిని రత్నాకర్ రావు, 94909, 52646