హైదరాబాద్: సాటి మనిషికి సాయం చేయాలంటే ఐశ్వర్యవంతులే కానవసరం లేదు. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్ నేరెడ్మెట్కు చెందిన చరితారెడ్డి అవయవ దానంతో తొమ్మిది మందికి జీవితాన్ని ప్రసాదించింది. మాట సాయం కరవైపోతున్న ఈ రోజుల్లో తన ప్రాణం పోయిన తర్వాత అవయవాలు అవసరమైన వారికి ఉపయోగపడాలనుకునే వారు అరుదు. అలాంటి వారి కోవలోకే వస్తుంది చరితారెడ్డి. మూడు రోజుల కిందట అమెరికా లాన్సింగ్లో జరిగిన కారు ప్రమాదంలో హైదరాబాద్ నేరెడ్మెట్కి చెందిన చరితారెడ్డి మృతి చెందింది.
ఈ ఘటనలో ఆమె బ్రెయిన్డెడ్ అయినట్లు ముస్కేగాన్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. మరణానంతరం తల్లిదండ్రుల అంగీకారంతో అవయవదానం చేశారు. జ్ఞాపకాలను తల్లిదండ్రులకు మిగిల్చి తొమ్మిది కుటుంబాల్లో వెలుగులు నింపింది. ధన సాయం చేస్తే ఖర్చు అయ్యే వరకూ గుర్తుండొచ్చు. అదే విధంగా మాట సాయం చేస్తే మనిషి ఉన్న వరకూ గుర్తుండొచ్చు. అవయవదానంతో మరణానంతరం కూడా గుర్తుండిపోవడమే కాదు.. ఎందరో జీవితాల్లో వెలుగులు నింపొచ్చు అనేందుకు చరితారెడ్డి నిదర్శనం. ఆమె భౌతికంగా దూరమైనా.. తొమ్మిది మంది జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
Charitha Reddy donates organs after dead in Car accident