యాదాద్రి భువనగిరి : యాదాద్రి అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కోరారు. ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ్మా స్వామిని దర్శించి, ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం యాదాద్రి అభివృద్ధి పనుల ప్రగతిపై జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, జాయింట్ కలెక్టర్ జి.రమేష్, వైటిడిఎ వైస్ చైర్మన్ కిషన్రావు, ఇంజనీర్ ఇన్ ఛీఫ్ గణపతిరెడ్డి, రవిందర్రావు ఆలయ ఇఓ గీత ఇతర అధికారులతో సమీక్షించారు. యాదాద్రి పరిసర ప్రాంతంలో 25కి.మీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు, దేవాలయ, వక్ఫ్భూములు ఉన్నచో గుర్తించి నివేదికలు పంపాలని అధికారులను కోరారు. రాయిగిరి చెరువును అన్ని హంగులతో అభివృద్ధి పరచాలని సూచించారు.
ఇప్పటివరకు జరిపిన భూసేకరణ వివరాలు, ఇంకా అవసరమున్న భూ వివరాలతో పాటు, నష్ట పరిహారం చెల్లింపు తీరుతెన్నులను, ఇంకా చెల్లించాల్సిన పరిహారం వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుట్ట చుట్టూ రింగ్ రోడ్డు త్వరితగతిన పూర్తి చేయడానికి గ్రామంలో భూసేకరణ పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దర్శనం అనంతరం దేవాలయ అభివృద్ధి పనులు పరిశీలించారు. ప్రధాన దేవాలయం, శివాలయం, ప్రసాద కాంప్లెక్సు పనులు, గుండం పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. దేవాలయ అభివృద్ధి పనుల ప్రగతిపై స్థపతుల పై ఆయన మాట్లాడారు. కొండపైకి యాత్రికుల రాకపోకలు వేరువేరు మార్గాలను ఆయన పరిశీలించారు.
టెంపుల్ సిటీలో జరుగుతున్న పనులు ప్రగతిని పరిశీలించారు. తొలుత ప్రభుత్వ ప్రధాన కర్యాదర్శికి ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చకులు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో అర్చక స్వాములు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేసారు. అనంతరం సోమేష్ కుమార్ దంపతులకు ఆలయ ఇఓ లడ్డు ప్రసాదాలు అందజేసారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, ఆలయ ఇఓ గీతారెడ్డి వైటిడిఎ వైస్ చైర్మన్ తదితరులు ఘన స్వాగతం పలికారు.