Friday, May 3, 2024

తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సిఎం కెసిఆర్ దంపతులు

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ: తెలంగాణ తిరుమలగా ప్రసిద్ది గాంచిన తెలంగాణ తిరుమల దేవస్థానం 8వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు బుధవారం పాల్గొన్నారు. బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ పరిసరాల్లో కొలువై ఉన్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గత నాలుగు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇలవేల్పుగా వెంకటేశ్వర స్వామిని సేవిస్తూ ఆలయ అభివృద్ధ్దికి సహాయ, సహకారాలు చేస్తూ ఆలయాన్ని రాష్ట్రంలో గుర్తింపు తేవడంతో అందరి దృష్టి తెలంగాణ తిరుమల దేవస్థానంపై మళ్లింది. ప్రతి సంవత్సరం పోచారం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

అందులో భాగంగా ప్రస్తుత సంవత్సరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా, అభివృద్ధి చేయడానికి సిఎం కెసిఆర్‌ను ఆలయానికి తీసుకుని రావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆలయం వైపు మళ్లింది. సీఎం కేసిఆర్ తమ నియోజకవర్గానికి వస్తే ఆలయాభివృద్ధితో పాటు నియోజకవర్గ అభివృద్ధ్ది పనులు మంజూరు చేయించుకోవచ్చనే ఉద్దేశ్యంతో చేపట్టిన సిఎం కెసిఆర్ పర్యటన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కలిసి వచ్చింది. వెంకటేశ్వర స్వామి వారికి దాతల సహకారంతో 2 కిలోల బంగారు కిరీటాన్ని సీఎం కేసిఆర్ చేతుల మీదుగా దేవస్థానానికి అందజేయడం జరిగింది. శ్రీవారు, అమ్మవార్లకు సీఎం కేసిఆర్ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు.

ఆలయంలో శ్రీవారి ఉత్సవాల సందర్భంగా కెసిఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఉత్సవంలో పాల్గొన్నారు. వేద పండితులు సిఎం కెసిఆర్, స్పీకర్ దంపతులకు ఆశీర్వాదాలు అందజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News