హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు వీరారెడ్డి ఈ గడ్డమీద పుట్టిన బిడ్డ అని సిఎం కెసిఆర్ తెలిపారు. వీరారెడ్డికి సెల్యూట్ చేసి ఈ కార్యక్రమానికి వచ్చానని, తెలంగాణ కోసం జైలుకు వెళ్లిన వారిలో వీరారెడ్డి ఒకరని ప్రశంసించారు. మూడు చింతలపల్లిలో ధరణి పోర్టల్ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ధరణి పోర్టల్ గురించి ఆత్మీయ సమ్మేళనంలో కెసిఆర్ ప్రసంగించారు. ధరణి పోర్టల్ భారతదేశానికే ట్రెండ్ సెట్టర్గా మారిందన్నారు. మూడు చింతలపల్లికి ప్రత్యేకమైన గౌరవం దక్కిందన్నారు. చారిత్రిక ఘట్టానికి ముడూచింతలపల్లి వేదికగా మారిందన్నారు. ధరణి పోర్టల్ గురించి చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని, ఒకప్పుడు భూమి కేవలం ఉత్పత్తి సాధనంగా మాత్రమే ఉందని, ఒకప్పుడు భూమికి ప్రాధ్యాన్యత ఉండేది కాదని, నిర్ణీత పద్ధతిలో వ్యవసాయం చేసిన తరువాత భూమికి విలువ పెరిగిందన్నారు.
తెలంగాణ వెనక బడిన ప్రాంతం కాదని వెనకకు నెట్టివేయబడిన ప్రాంతమన్నారు. తెలంగాణ వివక్షకు గురైన ప్రాంతమని, 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర తలసరి ఆదాయం 1,12,000 రూపాయలు ఉందని, ఐదు సంవత్సరాల కాలంలో తెలంగాణ తలసరి ఆదాయం 2,28,000 రూపాయలకు చేరిందని ప్రశంసించారు. ఐదు సంవత్సరాల కాలంలో మన తలసరి రెండింతలు అయిందని గుర్తు చేశారు. 2014లో ఆర్థిక ప్రగతిలో దేశంలో తెలంగాణ 13, 14 వ స్థానంలో ఉందని, ఇప్పుడు మన రాష్ట్రం ఐదో స్థానంలో ఉందని కెసిఆర్ గర్వంగా చెప్పారు. తప్పులు చేసే అధికారం తనకు లేదని, దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రజలు తనపై పెట్టారని, కొన్ని విషయాల్లో నిర్మొహమాటంతో పని చేశానని చెప్పుకొచ్చారు. మిషల్ భగీరథతో శాశ్వతంగా మంచినీటి బాధలు తీరుస్తున్నానని, సంకల్ప బలం, చిత్త శుద్ధి వాక్ శుద్ధి ఉంటే ఏదైనా చేసి నిరూపించవచ్చన్నారు. తెలంగాణలో ఉన్న చాలా జఠిలమైన సమస్యలను పరిష్కరించానని, తాను కూడా వ్యవసాయదారుణ్నే అని అన్నారు.
భూ రిజిస్ర్టేషన్ల విషయంలో పాత రిజిస్ర్టేషన్ ఛార్జీలే వర్తిస్తాయని కెసిఆర్ స్పష్టం చేశారు. రిజిస్ర్టేషన్ ఛార్జీల్లో ఒక్క పైసా కూడా పెంచలేదని ఆయన పేర్కొన్నారు. ఈ పోర్టల్లో అక్రమ రిజిస్ర్టేషన్లకు తావు ఉండదని ఆయన వెల్లడించారు. రిజిస్ర్టేషన్ల కోసం పైరవీలు చేసే అవసరం ఉండదని ఆయన తేల్చి చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కెసిఆర్ అన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభంతో రాష్ర్టంలోని 570 ఎమ్మార్వో కార్యాలయాలు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలుగా మారాయని కెసిఆర్ తెలిపారు.
తెలంగాణలో సాదా బైనామాల గడువు మరో వారం పొడిగిస్తున్నట్లు కెసిఆర్ చెప్పారు. సాదాబైనామాల ద్వారా క్రయ, విక్రయాలు జరిపిన వాళ్లు చివరి అవకాశం వినియోగించుకోవాలని ఆయన సూచించారు. భవిష్యత్లో సాదా బైనామాలకు అవకాశం ఉండదని ఆయన వెల్లడించారు.