Thursday, May 2, 2024

సైద్ధాంతికంగా కాంగ్రెస్, లెఫ్ట్ దివాలా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ వెలుపల వాటి మధ్య తీవ్ర పోటీ
ఢిల్లీలో మాత్రం చెట్టాపట్టాల్
బిజెపి చీఫ్ నడ్డా

వయనాడ్ (కేరళ) : ఇండియా కూటమిలో కాంగ్రెస్, లెఫ్ట్ వంటి పార్టీలు ‘సైద్ధాంతికంగా దివాలా తీశాయి’ అని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా శుక్రవారం విమర్శించారు. బిజెపిని వ్యతిరేకించేందుకు దేశ రాజధానిలో సుహృద్భావ సంబంధాలు సాగించే ఆ పార్టీలు ఢిల్లీ వెలుపల మాత్రం పరస్పరం ఎన్నికల్లో పోటీ పడుతుంటాయని ఆయన ఆక్షేపించారు. బిజెపి అభ్యర్థి కె సురేంద్రన్‌కు మద్దతుగా ఎన్‌డిఎ సుల్తాన్ బథెరిలో నిర్వహించిన ఒక రోడ్‌షోకు హాజరైన నడ్డా విడిగా ‘పిటిఐ’తో మాట్లాడుతూ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎల్‌డిఎఫ్ అభ్యర్థి అన్నీ రాజా (సిపిఐ) మధ్య ఎన్నికల పోటీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

నడ్డా తన వాదనకు సమర్థనగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య ఈ పోరు గురించి మాట్లాడారు. ఇతర ప్రాంతాల్లో ప్రత్యర్థులుగా ఉంటున్నా న్యూఢిల్లీలో వాటి అగ్ర నాయకత్వాల మధ్య సాగుతున్న మైత్రి గురించి ఆయన మాట్లాడారు. ‘రాహుల్ గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్, సిపిఐ (ఎం), సిపిఐ ద్వంద్వ ప్రమాణాలు, కాపట్యం ఇక్కడ కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా భార్య (అన్నీ రాజా) ఎల్‌డిఎఫ్ అభ్యర్థిగా రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్నారు. అయితే, ఢిల్లీలో డి రాజా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మధ్య కూర్చుంటారు. వారు సైద్ధాంతికంగా దివాలా తీశారు. దాని ఫలితం ఇక్కడ కనిపిస్తోంది’ అని నడ్డా పేర్కొన్నారు.

ఇవిఎంలో లోపాలు లేనట్లయితే బిజెపి 180కి మించి సీట్లు గెలవబోవడం లేదు అన్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపణ గురించి ప్రశ్నించినప్పుడు బిజెపి చీఫ్ ఆమెపై విమర్శనాస్త్రాలు సంధించారు. కర్నాటకలో ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచినప్పుడు కాంగ్రెస్ నేతలకు ఇవిఎంలతో సమస్యలు ఏవీ లేకపోయాయని ఆయన అన్నారు. ప్రియాంకను, ఆమె సోదరుడు రాహుల్‌ను ‘రాజకీయ పర్యాటకులు’గా నడ్డా పేర్కొంటూ, ‘వారు ఎన్నికల కోసం వచ్చి, మాయమైపోతారు. వారి ప్రకటనలను ఎందుకు తీవ్రంగా పరిగణిస్తుంటారు’ అని అన్నారు.

‘వారు కర్నాటకలో గెలిచినప్పుడు వారికి ఇవిఎంలతో సమస్యలు లేవు. వారు ఐదు సంవత్సరాల పాటు రాజస్థాన్‌లో పాలించినప్పుడు వారి ఇవిఎంలతో సమస్యలు లేవు’ అని నడ్డా ఆక్షేపించారు. లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి బలమైన ఉనికి లభిస్తుందని పార్టీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. ‘దక్షిణాదిలో ఎంతో ఉత్సాహం చూశాను. వయనాడ్‌లో సురేంద్రన్ కోసం రోడ్ షోలో అది గమనించాను. ప్రజలు ఉత్సాహంతో ఉన్నారు. అధిక సంఖ్యలో జనం వచ్చారు’ అని నడ్డా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News