హైదరాబాద్ : పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభ్యర్థులు ఈ నెల 13వ తేదీన గచ్చిబౌలిలోని సైబరాబాద్లోని సిటిసి గ్రౌండ్లో రిపోర్టు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ కోరారు. కానిస్టేబుల్స్గా ఎంపికైన 3,139 అభ్యర్థులను వేరు వేరు శిక్షణ కేంద్రాలకు పంపించనున్నట్లు తెలిపారు.
అభ్యర్థులకు సూచనలు…
అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఒక సెట్ జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు, పాన్ కార్డు, 10 పాస్ పోర్టు సైజ్ ఫొటోలు తీసుకురావాలి. సిటిసి గ్రౌండ్, సైబరాబాద్లో రిపోర్ట్ చేసిన అనంతరం ఆరోగ్య భద్రత మొదటి నెల చందా కింద రూ.90, కార్డుకు 15రూపాయలు, మొత్తం రూ.105 చెల్లించాలి. అదే రోజు నుంచి అభ్యర్థులకు ఆరోగ్య భద్రత అమల్లోకి వస్తుంది.
శిక్షణకు వెళ్లు అభ్యర్థులు నియామకం జరిగిన తేదీ నుంచి శిక్షణ తర్వాత కనీసం 5 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో సేవలు అందిస్తామని రూ.100 నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపరపైన రూ.5,000 సెక్యూరిటీ బాండ్ ఇవ్వాలి. ఏదైనా కారణం వల్ల శిక్షణ నుంచి వెళ్లిపోతే అభ్యర్థులు శిక్షణ ఖర్చులు, వేతనం వాటినికి తోడుగా రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది.
అభ్యర్థులకు సంబంధిత శిక్షణ కేంద్రాలలో రిపోర్టింగ్ చేసే సమయంలో మెస్, ఇతర చార్జీల కోసం రూ.6,000 జమ చేయాల్సి ఉంటుంది. మెస్ చార్జీలు తిరిగి అభ్యర్థులకు చెల్లించడం జరుగుతుంది. అభ్యర్థి తమ వెంట రెండు ఖాకి నిక్కర్లు, రెండు తెల్ల బనియన్లు(హాఫ్ హ్యండ్)వెంట తీసుకుని రావాలి. బెడ్ షీట్ మినహా పిల్లో, ప్లాస్టిక్ బకెట్, మగ్గు, షూపాలిష్, పాలిషింగ్బ్రెష్, తాళం వెంట తీసుకుని రావాలి. పోలీస్ శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట శిక్షణ కేంద్రాలకు బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు తీసుకుని రాకూడదు. శిక్షణ కేంద్రానికి ఎవరిని వెంట తీసుకుని రాకూడదు.