ప్రపంచకప్పై తొలగని ఉత్కంఠ
మెల్బోర్న్: కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియాలో విదేశీయుల పర్యాటనపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. కరోనా రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుండడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆంక్షలు విధించి చాలా రోజులు అయినా ఆస్ట్రేలియా దీనిపై ఎటువంటి ప్రకటన చేయడం లేదు. మరోవైపు అక్టోబర్ 18 నుంచి ఆస్ట్రేలియా వేదికగా ట్వంటీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. కాగా, ఆంక్షల నేపథ్యంలో విదేశీ జట్ల క్రికెటర్లు ఆస్ట్రేలియాలో చేరడం కష్టంగా మారింది. కనీస ప్రాక్టీస్ లేకుండానే చాలా జట్లు నేరుగా వరల్డ్కప్ బరిలోకి దిగాల్సిన స్థితి నెలకొంది. మరోవైపు ఇటు ఆస్ట్రేలియా ప్రభుత్వం కానీ, అటు అంతర్జాతీయ క్రికెట్ మండలి కానీ దీనిపై ఎటువంటి ప్రకటన చేయడం లేదు.
దీంతో టోర్నీ నిర్వహణకు సంబంధించి కొత్త అనుమానాలు నెలకొన్నాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ క్రీడలు వాయిదా పడ్డాయి. మరోవైపు దీని ప్రభావం టి20 ప్రపంచకప్పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. టోర్నీ సమయం దగ్గర పడుతున్నా క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అసలు షెడ్యూల్ ప్రకారం ప్రపంచకప్ నిర్వహిస్తారా లేకుంటే వాయిదా వేస్తారా అనేది తేలడం లేదు. దీంతో టోర్నీపై అన్ని జట్ల ఆటగాళ్లలోనూ ఆందోళన నెలకొంది. కరోనా ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. దీంతో టోర్నీ నిర్ణీత సమయంలోనే ఆరంభం అవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకమే.