కరీంనగర్ : ఇటీవల ఇండోనేషియా నుంచి కరీంనగర్కు వచ్చిన మత ప్రచారకులతో కలిసి సంచరించిన ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో అతడిని హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కె.శశాంక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మత ప్రచారకులకు కరోనా వైరస్ ఉండడం వల్లనే కరీంనగర్ వ్యక్తికి కూడా సోకిందని కలెక్టర్ తెలిపారు. కరోనా సోకిన కరీంనగర్ వ్యక్తి ఇంతవరకు ఎవరిని కలిశారో వారితో పాటు ఇదివరకు ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులతో సన్నిహితంగా సంచరించిన వారు కూడా కచ్చితంగా కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వచ్చి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో సూచించారు. కరీంనగర్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఒకరికి ఒకరు దూరం పాటించాలని కలెక్టర్ కోరారు. పరిశుభ్రత పాటించడంతో నిత్యం చేతులు శుభ్రం చేసుకోవాలని, సానిటైజర్స్ ఉపయోగించాలని పేర్కొన్నారు. ఈ నెల 31 వరకు ప్రజలందరూ ఇండ్లకే పరిమితం కావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.