Sunday, April 28, 2024

కరోనా వ్యాక్సిన్-క్యూబా ఆదర్శం

- Advertisement -
- Advertisement -

Corona vaccine-Cuba ideal

 

అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అన్న సద్భావం గురించి తెలిసిందే. అదే విధంగా ప్రతి ఒక్కరూ కరోనా నుంచి సురక్షితంగా బయటపడేంత వరకు ఎవరికీ రక్షణ ఉండదు అని గ్రహించాలి. కొత్త రకం వైరస్‌లు తయారు కావటం, వాటి నిరోధానికి జరుగుతున్న పోరాటం ముఖ్యంగా కరోనా మానవాళికి చరిత్రలో ఎదురైన అతిపెద్ద సవాలు. ఇలాంటి విపత్తు సమయంలో కూడా మన దేశంలోనూ, ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కంటే ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉద్రిక్తతలకు కారణం అవుతున్న అమెరికా సామ్రాజ్యవాదులు తీరుతెన్నులుఅందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు కరోనా నుంచి కూడా లాభాలు పిండుకొనేందుకు ఔషధ కార్పొరేట్లు ప్రయత్నించటం దారుణం. వ్యాక్సిన్ పంపిణీ, లభ్యత అసమానంగా ఉంటే ఏడాదికి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు 1.2లక్షల కోట్ల డాలర్ల నష్టం అని రాండ్ కార్పొరేషన్ అంచనా వేసింది. వ్యాక్సిన్లు సమ ప్రాతిపదికన పంపిణీ చేయనట్లయితే ప్రపంచానికి నైతికంగా, ఆర్ధికంగా వినాశకరమే అని ప్రపంచ ఆరోగ్య సంస్ద డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనావ్‌ు చెప్పారు.

ఇది రాసిన సమయానికి అమెరికా తరువాత స్ధానంలో ఉన్న బ్రెజిల్‌ను కిందికి నెట్టి మన దేశం మొత్తం కేసుల్లో రెండవ స్థానంలో ఉంది. ఏప్రిల్ 16న రెండు లక్షల పదహారు వేలకు పైగా కేసులు రోజుకు నమోదయ్యాయి.మహారాష్ర్ట తరువాత ఉత్తరప్రదేశ్ రెండోస్ధానంలో ఉంది.కొత్త కరోనా వైరస్‌లు పెరుగుతున్న నేపథ్యంలో పాత వైరస్‌కు తయారు చేసిన వ్యాక్సిన్ల గురించి ఒక వైపు అనుమానాలు. మరోవైపు సాధ్యమైన త్వరగా దాన్నుంచి లబ్ధి పొందాలని కార్పొరేట్లు ప్రయత్నిస్తున్నాయి. వ్యాక్సిన్లు వస్తాయి, 2020 డిసెంబరు నాటికి కరోనాను అదుపులోకి తెస్తాం, త్వరలో సామూహిక రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పిన వారి అంచనాలు తప్పాయి. ఆశించిన వారికి కొత్త రకాల విజృంభణతో ఆశాభంగం కలిగేలా పరిణామాలు ఉన్నాయి. పరిమిత మరణాలతో వ్యాధి తీవ్రత తగ్గటానికి వ్యాక్సిన్లు మినహా మరొక మార్గం కనిపించటం లేదు. అదే సమయంలో అవే కరోనాను కట్టడి చేస్తాయనే హామీ లేదు. కొత్త వైరస్‌ను కనుగొనే సామర్ధ్యమే అనేక దేశాలకు లేని స్ధితిలో వాటికి వ్యాక్సిన్లు తయారు చేయటం ఎంత పెద్ద సవాలో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం ఇదే. కనిపిస్తున్నదాని కంటే పరిస్థితి తీవ్రంగా ఉంది. అమెరికా, బ్రిటన్ తమ దేశాల్లో తయారయ్యే వ్యాక్సిన్ స్ధానిక వినియోగానికి మాత్రమే అని ప్రకటించాయి. ఐరోపా యూనియన్ తమ సభ్య దేశాల మధ్యనే వినియోగిస్తున్నది. చైనా, భారత్‌లు మాత్రమే ఇతర దేశాలకు ముఖ్యంగా పేద, అభివృద్ది చెందుతున్న దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. అయితే ప్రతి దేశం వ్యాక్సిన్ దౌత్యానికి పాల్పడుతున్నదనే విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తవం లేదని చెప్పలేము. కమ్యూనిస్టు వ్యతిరేకత, ఇతర రాజకీయ కారణాలతో చైనా వ్యాక్సిన్ల సామర్ధ్యం మీద తప్పుడు ప్రచారం చేయటంతో పాటు వాటిని తిరస్కరించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ కారణాలతో పాటు మన దేశంలో తయారీ ఖర్చు తక్కువగా ఉండటంతో అనేక బహుళ జాతి కంపెనీలు తమ ఉత్పత్తులను మన దేశంలో తయారు చేయిస్తున్నాయి. ఈ కారణంగా రాబోయే రోజుల్లో చైనా కంటే మన దేశం ఉత్పత్తిలో ముందుండవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే చైనాలో ఉన్న సంస్ధలు మనకంటే ఎక్కువగా ఉత్పత్తి చేయగల స్థితిలో ఉన్నాయి.

అనేక అంశాలలో సోషలిస్టు దేశాలు ఇతర దేశాల మధ్య స్పష్టమైన తేడాలను గతంలో ప్రపంచం చూసింది. ఇప్పుడు కరోనా విషయంలో కూడా అదే వెల్లడైంది. చైనా, వియత్నాం కరోనాను ఎలా కట్టడి చేశాయో, ఆర్ధిక దిగజారుడును ఎలా తప్పించాయో తెలిసిందే. అమెరికాలో తయారు చేసిన వ్యాక్సిన్లకు పేటెంట్ హక్కు ఉన్న కారణంగా లాభాల కోసమే వాటిని తయారు చేస్తున్నారు. సామాన్యులకు వాటి ధర అందుబాటులో ఉండదు. కోవిషీల్డ్‌ను మన దేశంలో తయారు చేస్తున్న పుణెలోని సీరం సంస్ధ ప్రభుత్వానికి ఒక డోసును 150 రూపాయలకు ఇస్తున్నామని, బయటి మార్కెట్లో వెయ్యి రూపాయలకు అమ్ముకొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఎగుమతుల మీద నిషేధం విధించిన కారణంగా తమకు నష్టం వస్తున్నదని అందువలన కేవలం మన దేశానికి మాత్రమే తయారు చేయాలంటే ఉత్పాదకత సౌకర్యాలను పెంచేందుకు ప్రభుత్వం తమకు మూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరింది. ఎగుమతులకు అనుమతి ఇవ్వాలని వత్తిడి చేస్తోంది.

వివిధ రకాల వ్యాక్సిన్లు అందుబాటులో లేని కారణంగా పేద, వర్దమాన దేశాల్లో ఏటా పదిహేను లక్షల మంది మరణిస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాలకు భిన్నంగా తాము తయారు చేసిన వ్యాక్సిన్ ఎవరైనా తయారు చేసేందుకు దాని ఫార్ములాను అందచేస్తామని, పేటెంట్ హక్కును వదులు కుంటామని క్యూబా ప్రకటించింది. గతంలో పోలియో వ్యాక్సిన్ కనుకొన్న అమెరికా శాస్త్రవేత్త జోనాస్ సాక్ దాని మీద పేటెంట్ హక్కును వదలుకొని ప్రపంచంలో ఎవరైనా తయారు చేసేందుకు అవకాశం ఇచ్చిన ఆదర్శానికి అనుగుణ్యంగా ఇది ఉంది. మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, ఫైజర్ వంటి ఇతర ఔషధ కంపెనీలు వ్యాక్సిన్ పరిశోధనలకు ప్రభుత్వాల నుంచి పెద్ద మొత్తంలో నిధులు పొందినప్పటికీ, వాటి ఫార్ములాను ఇతరులకు అందించేందుకు నిరాకరిస్తున్నాయి. జనం ప్రాణాలు కోల్పోయినా సరే తమ లాభాల వేటలో ఉన్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్ధ కరోనా వ్యాక్సిన్ తయారీ కార్యక్రమంలో 142 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. 130 కోట్ల జనాభా ఉన్న ఆఫ్రికా ఖండానికి జూన్ నాటికి కేవలం కోటీ 40లక్షల డోసులు మాత్రమే అందుతాయని గార్డియన్ పత్రిక విశ్లేషించింది. ప్రపంచ వ్యాప్తంగా 700 కోట్ల డోసులు కొనుగోలు చేస్తే వాటిలో 420 కోట్లు ప్రధాన పెట్టుబడిదారీ దేశాలకే పోతున్నదని కూడా తెలిపింది. నిజానికి ప్రపంచ జనాభా మొత్తానికి వ్యాక్సిన్ల తయారీకి అవకాశాలున్నప్పటికీ లాభాల కోసం ఆ పని చేయటం లేదు. అంతిమంగా కొన్ని లక్షల కోట్ల డాలర్లను కార్పొరేట్లు లాభం పొందితే ఆ మేరకు సామాన్యజనం నష్టపోతారు.లాటిన్ అమెరికాలో క్యూబాతో పోలిస్తే ధనిక దేశాలు అనేకం ఉన్నాయి. కానీ కరోనా వ్యాక్సిన్సు రూపొందించిన దేశం క్యూబా ఒక్కటే. ఐదు రకాల వాక్సిన్ల తయారీకి పూనుకొని రెండింటిని జనానికి అందుబాటులోకి తెచ్చింది.

మే నెలాఖరుకు పెద్ద వారందరికీ వ్యాక్సిన్లు వేయనున్నారు. ఆగస్టు నాటికి 70 శాతం మందికి ఏడాది ఆఖరుకు మొత్తం జనాభాకు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఒక్క కరోనానే కాదు అన్ని వాక్సిన్లు అక్కడి వారికి ఉచితంగానే వేస్తారు. కరోనా వ్యాక్సిన్ తమ పౌరులకే కాదు, తమ దేశ పర్యటనకు వచ్చిన వారందరికీ కావాలంటే వేస్తున్నారు. మా దగ్గర లేని దాన్ని మేం ఇవ్వలేము, ఉన్నదాన్ని అందరం పంచుకుంటాం అనే సూత్రాన్ని పాటిస్తున్నారు. బ్రిటన్ ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ (మన దేశంలో కోవిషీల్డ్ పేరుతో సీరం సంస్ధ తయారు చేస్తున్నది) అభివృద్ధిలో 97 శాతం సొమ్ము ప్రజల నుంచి లేదా దాతల నుంచి వచ్చిందే అని తేలింది. అంతేకాదు రెండువేల సంవత్సరం నుంచి జరుపుతున్న వివిధ పరిశోధనల సారాన్ని విశ్వవిద్యాలయ పరిశోధకులు వినియోగించుకున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీకి ధనాశ, పెట్టుబడిదారీ విధానమే కారణమని దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ చేసిన వ్యాఖ్యలోని డొల్లతనాన్ని గార్డియన్ పత్రిక బయటపెట్టింది.

ప్రయివేటు పెట్టుబడిదారుల నుంచి కేవలం 2.8 శాతం నిధులు మాత్రమే అందాయని, పారదర్శకతలేని కారణంగా వివరాలు జనానికి తెలియటం లేదని పేర్కొన్నది. ఎలాంటి ప్రతిఫలం కోరకుండానే వాక్సిన్ తయారు చేసే అర్హత ఉన్నవారందరికీ ఫార్ములా అందచేస్తామని తొలుత ఆక్స్‌ఫర్డ్ ప్రకటించింది. అయితే గతేడాది ఆగస్టులో బిల్‌గేట్స్ కోరిక మేరకు బ్రిటీష్ స్వీడిష్ ఔషధ తయారీ సంస్ధ ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం చేసుకుంది. అది వివిధ దేశాలో సీరం వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకొని ఉత్పత్తి చేయిస్తున్నది. లాభాల కోసం తాము వ్యాక్సిన్ విక్రయాలు జరపమని, ఆ మేరకు ఉత్పత్తిదారులతో ఒప్పందం చేసుకుంటామని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. అయితే కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిన తరువాత వ్యాక్సిన్ ధరను నిర్ణయించే హక్కును అట్టిపెట్టుకున్నట్లు తెలిపింది. ఇక్కడే అసలు కీలకం ఉంది. వ్యాక్సిన్లు పరిమితం కాలం మాత్రమే ప్రభావం చూపుతాయని అందువలన రాబోయే సంవత్సరాలలో అదనపు డోసులను ఇవ్వాల్సి వస్తే దాన్ని లాభాలకు ఉపయోగించుకోవాలన్న దూరాలోచన దాని వెనుక ఉంది.

వాక్సిన్ల తయారీకి సంవత్సరాల సమయం పట్టటం, ప్రారంభ పెట్టుబడి ఎక్కువగా ఉండటం, దాని ఉపయోగం పరిమిత కాలమే అయితే నష్టం కనుక ఔషధ సంస్ధలు పరిశోధనలకు మొగ్గుచూపటం లేదు. అటువంటి స్ధితిలో కరోనా వాటికి ఒక వరం మాదిరి తయారైంది. లాభాలు పిండుకోవచ్చని అంచనా వేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్ధలు ఉత్పత్తి రేటు కంటే ప్రభుత్వానికి తక్కువకు ఇస్తున్నామని చెబుతున్నాయి. పరిశోధన అభివృద్ధి ఖర్చు, పంపిణీ, మార్కెటింగ్ ఖర్చు లేనందున అవి వాటికి కలసి వచ్చినట్లే. ఏ ప్రైవేటు సంస్ధా లాభం లేకుండా ఏ పనీ చేయదు. గరిష్ఠ స్ధాయిలో ఉత్పత్తి చేస్తున్నందున టర్నోవరు ఎక్కువగా ఉండి లాభాలు దండిగానే ఉంటాయి. ప్రభుత్వ కార్యక్రమం ముగిసిన తరువాత అవి ఎంత చెబితే అంతకు జనం కొనుగోలు చేయాల్సిందే. లాభాల గురించి అడిగితే ఇంతవరకు ఏ సంస్థ నోరు విప్పేందుకు సిద్ధంగా లేదు. పుణెలోని సీరం సంస్థ ప్రధానంగా వ్యాక్సిన్ల తయారీ మీదే కేంద్రీకరించింది.

చైనా విషయానికి వస్తే కరోనా వ్యాక్సిన్ ప్రజా వస్తువు అని ప్రకటించింది. అనేక దేశాలకు అందచేస్తామని ప్రకటించింది. అయితే అదేమీ వాణిజ్య ప్రాతిపదిక కాదు, అలాగని ఉచితమూ కాదు. మన దేశం విరాళంగా ఇస్తున్నట్లే అది కూడా ఇస్తోంది. ప్రతి వ్యాక్సిన్ సామర్ధ్యం గురించి అనేక అనుమానాలు ఉన్నాయి, కొన్ని ఎక్కువ మరికొన్ని తక్కువ కావచ్చు. తమ ప్రత్యర్ధి సంస్ధ తయారు చేస్తున్నది ఒట్టి నీళ్లే అని మన దేశంలోని ఒక సంస్ధ కొట్టిపారేసిన విషయం తెలిసిందే. తరువాత ఆ రెండూ సర్దుబాటు చేసుకొని నోరుమూసుకున్నాయి. చైనాలో ప్రస్తుతం కేసులేవీ లేవు ఉన్నా వాటిని పెద్దగా లెక్కలోకి తీసుకోదగ్గవి కాదు. కనుక అక్కడ వ్యాక్సిన్ తయారీ విదేశాలకు అందచేయటానికి ఎక్కువ అవకాశాలున్నాయి.

అలాగని దేశీయంగా వ్యాక్సిన్లు వేయటం లేదని కాదు. వెయ్యి పడక ఆసుపత్రిని వారం రోజుల్లో సిద్ధం చేయగలిగిన వారికి అవసరమైతే వ్యాక్సిన పెద్ద ఎత్తున తయారు చేయటం పెద్ద సమస్య కాదు. కరోనా కాటుకు జనం బలవుతున్నా కొన్ని దేశాలు రాజకీయాలు మానుకోలేదు. తప్పుడు ప్రచారాన్ని వ్యాపింప చేస్తున్నాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో రక్తం గడ్డకడుతున్నదనే సాకుతో అనేక దేశాలు దాన్ని నిషేధించాయి. దీనిలో శాస్త్రం కంటే ఇతర అంశాలే ప్రధానంగా ఉన్నాయని అనేక మంది నిపుణులు చెబుతున్నారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం తయారు చేసిన దాని మీదే ఇంత రాజకీయం చేస్తుంటే చైనా తయారు చేసిందాని గురించి తప్పుడు ప్రచారంలో ఆశ్చర్యం ఏముంటుంది ?

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News