Monday, May 13, 2024

ఆర్‌టిసి బిల్లుపై త్వరలో నిర్ణయం

- Advertisement -
- Advertisement -

గవర్నర్ కోటా ఎంఎల్‌సి అభ్యర్థుల
అర్హతలపై అధ్యయనం కెసిఆర్
అనుభవం, ముందుచూపుపై ప్రశంసలు
వైద్యరంగంలో ప్రగతి బాగుంది
ఐదవ ఏట అడుగిడిన సందర్భంగా రాష్ట్ర
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

మనతెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసి బిల్లుపై న్యాయశాఖ తన అభిప్రాయాలను గురువార మే అందజేసిందని, వాటిని పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకొంటానని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. అలాగే పెండింగ్‌లో వున్న గవర్నర్ కోటా ఎంఎల్‌సిల ప దవులకు ప్రభుత్వం పంపిన అభ్యర్థుల అర్హతలను అధ్యయనం చేస్తున్నానని, వారు గవర్నర్ కోటా నిర్దేశించిన అర్హతల పరిధిలో ఉంటే దానిపై సంతకం చేయడానికి అభ్యంతరం లేదని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా నాలుగేళ్ళ పదవీ కాలం పూర్తి చేసుకొని ఐదవ ఏట అడుగిడిన సందర్భంగా ఆమె రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో విలేకరులతో మాట్లాడారు.

తాను తన పరిశీలనకు వచ్చిన ఏ ఫైల్ పైనా గుడ్డిగా సం తకం చేయనని, అన్ని కోణాల్లో పరిశీ లించిన తరువాతే నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తన విధులతో భద్రాచలం ఏజెన్సీలోని ఆరు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కాఫీ బుక్ ను ఆ విష్కరించారు. ఈ సందర్భంగా విలేకరు లు అ డిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. గవర్నర్ కోటా ఎంఎల్‌సి అనేది పొలిటికల్ నామినేషన్ కాదని, ఆ పదవుల ఎంపిక కు ఒక క్రైటేరియా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సిఎం కెసిఆర్‌తో సంబంధాలు, తన పదవీ కాలంలో ఎదురైన అనేక సవాళ్ళ గురించి ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వం పంపిన బిల్లులపై ఎలాంటి రాజకీయాల్లేవని, వాటిని పరిశీలించడానికి సమయం తీసుకోవడానికి కారణాలున్నాయని తమిళి సై వివరించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్‌ను నాలుగేళ్ళుగా పరిశీలిస్తున్నానని, ఆయన సమర్థుడైన క్షేత్రస్థాయి ముందు చూపు ఉన్న నేత అని, ఆయనతో గాని, ప్రగతి భవన్‌తో గాని ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. తనకు తెలంగాణ ప్రజలకు సేవ చేయడమనేదే ఏకైక లక్షమని, తనకెలాంటి పొలిటికల్ ఎజెండా లేదని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. తాను సవాళ్ళకు, కోర్టు కేసులకు, సోషల్ మీడియా విమర్శలకు, ప్రొటోకాల్ ఉల్లంఘనలకు భయపడే వ్యక్తిని కాదని, ఈ తరహా ప్రచారాలతో తననెవరూ కట్టడి చేయలేరని తమిళి సై అన్నారు. వైద్య రంగంలో తెలంగాణలో ప్రగతి ప్రశంసనీయంగా ఉందని పేర్కొంటూ మెడికల్ కళాశాలల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొంత వివాదం జరిగిందని తమిళి సై అన్నారు. రాష్ట్రానికి మెడికల్ కళాశాలలు ఇస్తామని కేంద్రం అడిగిన సమయంలో రాష్ట్రం స్పందించలేదని, ఆ తర్వాత స్పందించారని అన్నారు. తెలంగాణకు తనకు మధ్య దేవుడు ఇచ్చిన బంధం ఉందని, ఇక్కడి ప్రజలు తనపై అంతులేని ప్రేమ, అభిమానం చూపుతున్నారని, ఇది సుదీర్ఘంగా వుంటుందని ఆమె భావోద్వేగంతో చెప్పారు. మహిళా బిల్లు వస్తే అందరి లాగే తాను సంతోషిస్తానని అన్నారు. జమిలి ఎన్నికలను కూడా తాను సమర్థిస్తానని విలేకరుల ప్రశ్నలకు బదులుగా చెప్పారు. సోషల్ మీడియాలో తాను రాజకీయ కార్యకర్తనంటూ చేస్తున్న విమర్శలను అసలు పట్టించుకోనని, తన ధ్యాస అంతా పేద ప్రజల సేవ, మహిళా సాధికారతేనని ఆమె స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News