న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జెఎన్యుఎస్యు) అధ్యక్షురాలు అయిషే ఘోష్, మరో 19 మందిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యూనివర్సిటీ ఆస్తిని ధ్వంసం చేశారన్న ఆరోపణపై పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. శనివారం వీరంతా సర్వర్ రూమ్లోకి చొరబడి అక్కడి ఆస్తిని ధ్వంసం చేశారన్నది పోలీసుల ఆరోపణ. కాగా, ఆదివారం ఘోష్తో సహా పలువురు విద్యార్థులు, టీచర్లపై గుర్తు తెలియని దుండగులు ఆదివారం ముఖాలకు ముసుగులు ధరించి దాడి చేసిన విషయం తెలిసిందే. ఘోష్పై జెఎన్యు పాలనా యంత్రాంగం దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం ఉదయం కేసు నమోదు చేయగా అదేరోజు సాయంత్రం ఆమెపై దాడి జరిగింది. దాడి అనంతరం తలపై గాయాలతో రక్తమోడుతున్న మొహంతో ఉన్న ఘోష్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన దాడి వెనుక ఎబివిపి ఉందని విద్యార్థి సంఘం ఆరోపిస్తుండగా ఇది జెఎన్యుఎస్యు పనేనంటూ ఎబిపివి ప్రత్యారోపణ చేస్తోంది.
Delhi Police Files FIR against JNUSU leader Aishe Ghosh