Thursday, May 2, 2024

ఇంకా జలదిగ్బంధంలో ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీలో యమునా నది వరద నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతున్నా జలదిగ్బంధం నుంచి నగర వాసులు ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఐటీవో, శాంతివాన్ ఏరియా, ఇన్‌కం టాక్స్ ఆఫీస్ సమీపంలో ఇంకా అనేక కీలక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచే ఉన్నాయి. శనివారం ఉదయానినకి నదిలో నీటిమట్టం 207 మీటర్ల సమీపంలో ఉంది. ఇప్పికీ ప్రమాదస్థాయి కంటే రెండు మీటర్ల ఎగువనే ఉన్నప్పటికీ నీటి ప్రవాహం తగ్గుముఖం కాస్త ఊరటనిస్తోంది. అయితే శనివారం వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయడం ఆందోళన కలిగిస్తోంది. రానున్న మూడు నాలుగు రోజులు ఢిల్లీ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది.

వరద ప్రవాహం ధాటికి దెబ్బతిన్న ఇంద్రప్రస్థ వాటర్ రెగ్యులేటర్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిశీలించారు. త్వరగా మరమ్మతులు పూర్తి చేస్తామని కేజ్రీవాల్ చెప్పారు. ఈ రెగ్యులేటర్ దెబ్బతినడం వల్లనే నది లోని వరద ఇతర ప్రాంతాలకు వేగంగా విస్తరించింది. ఇసుక బస్తాలు,కంకరతో వరద ప్రవాహాన్ని ఆపేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, సైనిక జవాన్లు, ఢిల్లీ అధికారులు శ్రమిస్తున్నారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఢిల్లీలో యమునానది పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్ర మంత్రి అమిత్‌షాతో దీని గురించి మాట్లాడారు. రానున్న 24 గంటల్లో పరిస్థితి మెరుగుపడుతుందని షా ప్రధానికి వివరించారు.
హిమాచల్‌కు మరో రూ. 180 కోట్ల సాయం
వరదలతో దెబ్బతిన్న హిమాచల్ ప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం రెండో విడత సహాయ నిధిని ముందస్తుగా విడుదల చేసేందుకు కేంద్ర మంత్రి అమిత్‌షా ఆమోదం తెలిపారు. రూ. 180 . 40 కోట్లను ఎస్‌డీఆర్‌ఎఫ్ కి కేటాయించారు. వరద బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశం తో కేంద్రం హిమాచల్ ఎస్‌డిఆర్‌ఎఫ్‌కి 2023 24 సంవత్సరంలో విడుదల చేయాల్సిన సహాయ నిధిని ముందుగా విడుదల చేయనున్నట్టు అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికే జులై 10న మొదటి విడతగా రూ. 180. 40 కోట్లను విడుదల చేసింది. రెండోవిడతలో మరో రూ. 180. 40 కోట్లను విడుదల చేసేందుకు మంత్రి ఆమోదం తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల భారీ వర్షాలకు వరదలు తీవ్రంగా సంభవించిన సంగతి తెలిసిందే.

దీంతో రాష్ట్రాన్ని ఆదుకోడానికి కేంద్రం ముందుకొచ్చింది. ఎన్డీర్‌ఎఫ్ బలగాలతోపాటు బాధితులను తరలించడానికి ఒక 1 పారా ఎస్‌ఎఫ్‌తోపాటు 205 ఆర్మీ ఏవియేషన్ స్కాడ్రన్లను అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. వీటిలో రెండు ఎం117 వి 5 హెలికాప్టర్లను బాధితులకు తరలించేందుకు పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యలను పరిశీలించడానికి కేంద్రం ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేసింది. ఈ బృందాలు జులై 17న క్షేత్ర సందర్శనను ప్రారంభించనున్నాయి. ఇదిలా ఉండగా కుండపోత వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో 88 మంది మృతి చెందారు. 100 మంది గాయపడ్డారు. 16 మంది గల్లంతయ్యారు.

యమునోత్రి, గంగోత్రి రహదారుల మూసివేత
ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలకు లోయలు, కొండలతో కూడిన చార్‌ధామ్ మార్గాల్లో కొండచరియలు విరిగి పడుతున్నాయి. ముఖ్యంగా యమునోత్రి, బద్రీనాథ్ మార్గం చమోలీ జిల్లాలో పరిస్తితి మరింత తీవ్రంగా ఉంది. చామి పట్టణ సమీపంలో యమునోత్రి జాతీయ రహదారి 123. బద్రీనాథ్, దార్చులాతవాఘాట్ లిపులేఖ్ మార్గాల్లో కొండచరియలు విరిగిపడడంతో ఆ రహదారులన్నీ మూసివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News