Thursday, May 2, 2024

రైతులకు పోడు భూమి పట్టాల పంపిణీ

- Advertisement -
- Advertisement -

కుభీర్ : గిరిజన, ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కొమురం భీం ఆశయ సాధనకు సీఎం కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, జల్ జంగల్ జమీన్ స్ఫూర్తితో అడవి బిడ్డలను అన్నదాతలుగా చేసి భూమి హక్కులను కల్పిస్తున్నామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
బుధవారం కుబీర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిరిజనులకు పోడు భూమి పట్టాలను స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4,05,601 ఎకరాలకు చెందిన 1.51 లక్షల మంది అడవి బిడ్డల కోసం పోటు పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇకపై పోడు భూములకు కూడా రైతు బంధు ఇస్తామన్నారు. గిరివికాసం పథకం ద్వారా గిరిజన రైతులకు మేలు చేస్తున్నామని పట్టాదారులు తమ భూముల్లో బోర్లు వేసుకునేందుకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు.
త్రీ పేజ్ కరెంటు కూడా సరఫరా చేస్తామని చెప్పారు. పోడు రైతులపై ఉన్న కేసులను కూడా ప్రభుత్వం ఎత్తివేస్తుందని స్పష్టం చేశారు. హక్కుదారులు తమ భూములను అమ్ముకోవడానికి వీలు లేదని వారసులకు మాత్రమే పోడు భూములపై హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. ఆదివాసీల అభివృద్ది, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు.
తొమ్మిదేళ్లలో ఎజెన్సీలోని గ్రామాలు ఎంతో అభివృద్ధ్ది చెందాయని వివరించారు. మండలానికి చెందిన 278 మంది రైతులకు పోడు భూమి పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డి, జిల్లా గ్రామీణ అధికారి విజయలక్ష్మీ, జడ్పిటిసి అల్కతాయి, సంజయ్, వైస్ ఎంపిపి మోహియోద్దిన్, పిఎసిఎస్ చైర్మెన్ గంగాచరణ్, జిల్లా బిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, మాజీ జడ్పిటిసి శంకర్ చౌహన్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్, తహసీల్దార్ విశ్వంబర్, ఎంపిడివో లింబాద్రి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, అధికారులు, నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News