Friday, May 3, 2024

అంబేడ్కర్ ఆనాడే కనిపెట్టిన ముప్పు

- Advertisement -
- Advertisement -

Dr. B.R. Ambedkar 131st Birth Anniversary celebrations

స్వాతంత్య్ర భారతదేశం అంబేడ్కర్ 131వ జయంతి జరుపుకోవటానికి సిద్ధమవుతున్న సందర్భంలో ఆయన ఎన్నడూ లేనంత ఎత్తుకు ఎదిగినట్లు కనిపిస్తున్నది. అనేక ముఖ్య ఘట్టాలలో, ఉద్యమాలలో నవభారత నిర్మా ణం కోసం, ప్రజాస్వామ్యం కోసం, సామాజిక రుగ్మతలులేని దేశం కోసం అంబేడ్కర్ కృషి చేశారు. అంబేడ్కర్ జీవితానుభవంలో గుర్తించిన సామాజిక రుగ్మతలు, జరిపిన ఉద్యమాలు, అధ్యయనం, ఆలోచనలను ప్రయోగాత్మకంగా పరిశీలించాలి.భారత సమాజం గురించి ఆయన లోతుగా పరిశీలన చేసి లేవనెత్తిన అనేక ప్రశ్నలు నేటికీ సజీవంగా నిలిచి ఉండటం, ఆయన కృషిని, ప్రాధాన్యతని నేటికీ గుర్తు చేస్తున్నాయి. 1871 ఏప్రిల్ 14వ తేదీన మధ్య భారతదేశంలో మౌ అనే ప్రాంతం లో, మత భావాలను విశ్వసించే, పేద మెహర్ కుటుంబంలో భీవ్‌ురావ్ అంబేడ్కర్ జన్మించారు. పాఠశాల విద్యాభ్యాసం సతారా లోను, ముంబైలోను, కళాశాల విద్యాభ్యాసం ముంబైలోను పూర్తి చేసిన అంబేడ్కర్ 913, 1917లో కొద్దికాలం పాటు బరోడా మహారాజు దగ్గర సేవలు కూడా అందించారు.

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కొలంబియా విశ్వవిద్యాలయంలో, గ్రేస్ ఇన్ బాక్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించిన ఈ నవయువకుడు ఆనాటి సమకాలీన రాజకీయ నాయకులలో చాలా మందికి లేనటువంటి, అమోఘమైన పాండిత్యాన్ని సంపాదించారు. జీవితానికి సంబంధించిన అన్ని అంశాలలో లోతైన అవగాహనను ఆర్జించిన ఘనత అంబేడ్కర్‌కి దక్కుతుంది. అప్పుడప్పుడే అందివస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భీవ్‌ురావ్ విశేష ప్రతిభను కనపరిచారు. నిజానికి తన కుటుంబంలో, తన తోటి సమాజంలో మరెవ్వరూ అందుకోలేనటువంటివి అత్యధిక శాతం భీవ్‌ురావ్ అందుకున్నారు. అందులో కూడా ప్రతి ఒక్క అంశమంటే పాండిత్యం, మేధస్సు, ప్రొఫెషనల్‌గా సాధించిన విజయాలన్నిటిలోను కష్టపడి, పోరాడి సాధించుకున్నవే తప్ప అప్పనంగా వచ్చినవి కాదు. అందులోనూ ఆనాడు ఉన్నటువంటి సామాజిక అడ్డంకులు ముఖ్యంగా పక్షపాత వైఖరి, సామాజిక అణచివేతలు, కులపీడనలు వంటివి ఎదుర్కొని సాధించారు.
1920లలో తొలినాళ్ళకే అంబేడ్కర్ ఎవ్‌ు.ఎ, పి.హెచ్‌డి అర్థశాస్త్రంలో ఎవ్‌ు.ఎస్.సి,డి.ఎస్.సి, బారిస్టర్ ఎట్ లా పూర్తి చేశారు. తనకి 30 సంవత్సరాలు వచ్చే సరికే, ప్రముఖ విద్యావేత్తలు, అధ్యయనకారులు తమ జీవితకాలంలో సాధించలేనన్ని నిజ జీవిత అనుభవాలను అంబేడ్కర్ గడించారు.

నాలుగు దశాబ్దాల తన ప్రజాజీవితంలో అనేక వివాదాస్పద అంశాలలోనూ, అధిగమించటానికి వీలు లేనటువంటి అనేక సామాజిక సమస్యల మీద అంబేడ్కర్ ఒక హీరో లాగా వెలుగొందారు. అలెగ్జాండర్ గోల్డెన్‌పైసర్ 1916 మే నెలలో సామాజిక శాస్త్రాలపై సెమినార్ జరిపినప్పుడు, మొట్టమొదటి సారిగా అంబేడ్కర్ భారతదేశంలో కులాల తీరు తెన్నులు, పుట్టుక, అభివద్ధి అనే అంశంపై చాలా అద్భుతమైన పత్రాన్ని సమర్పించారు. పారదర్శకత, నిజాయితీ, పట్టుదల వంటి అపూర్వగుణాలు కలిగిన ఉదారవాది డా. అంబేడ్కర్. తాత్వికంగా మొదట ఆదర్శవాదం వైపు మొగ్గినప్పటికీ, అంతిమంగా బుద్ధుని సిద్ధాంతం వైపు ఆకర్షితుడయ్యారు. మార్క్సిజం పుస్తకాలను కూడా చాలా లోతుగా అధ్యయనం చేశారు. అవి ఎంతగా అంటే 1938లో బాంబేలో చరిత్రాత్మక ఖాట్ వ్యతిరేక ఉద్యమం జరిగినప్పుడు ఇక్కడ ఉన్న కమ్యూనిస్టు నాయకులకన్నా నేను కమ్యూనిస్టు సిద్ధాంతం గురించి లెక్కలేనన్ని ఎక్కువ పుస్తకాలను చదివాను అని ఆయన ప్రకటించారు. 1950లో ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉండి హిందూ కోడ్ బిల్లు తెచ్చినప్పుడు, అదే జవహర్‌లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా అంబేడ్కర్‌ను ఘోరంగా దెబ్బతీశారు. అంబేడ్కర్ జీవించినంత కాలం, ఆయన ప్రత్యర్ధులు, విమర్శకులు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు, ఆయనను ఆ యుగంలోని వ్యూహాత్మక లక్ష్యాన్ని గుర్తించలేని వ్యక్తిగా పదేపదే అభివర్ణించేవారు. ఆ ప్రచారం బాగా ప్రాచుర్యం పొంది, ఆఖరికి మీడియా కూడా ఆయనను ఒక రెండో తరగతి దేశనాయకుడిగా, షెడ్యూల్డ్ కులాలకే పరిమితమైన నాయకుడిగా చిత్రీకరించింది. వస్తుగతంగా చూస్తే ఆయనంత ఉన్నత వ్యక్తి, సాహసోపేతమైన దేశ నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారన్నది సుస్పష్టం.

దురదృష్టవశాత్తు స్వాతంత్య్ర పోరాటంలోని కొంత మంది హీరోలు, సామాజిక విప్లవకారులు సైతం అంబేడ్కర్ లోతైన అధ్యయనం, దృఢచిత్తం, సామాజిక అంతరాలపై జరిపిన బలమైన పోరాటాలను పూర్తిగా విస్మరించారు.కొంత మంది అయితే ఆయన దేశభక్తిని కూడా శంకించి, నీచంగా మాట్లాడారు. ఇంత వైవిధ్యభరితమైన, స్ఫూర్తివంతమైన స్వాతంత్ర పోరాట అనుభవాలను గమనిస్తే, అంబేడ్కర్ సామాజిక అంశాలపై ఎంత ప్రశంసనీయమైన ప్రశ్నలు సంధించారో అని మనం అభినందిస్తూనే ఆయన విమర్శకులు, శత్రువులవి శుద్ధ అబద్ధపు వాదనలుగా పరిగణించాలి. సామాజిక అంశాలపై, పోరాటాలపై లోతైన పార్శ్వాలన్నీ తట్టి చూపిన అంబేడ్కర్ ఆశయాన్ని ఇప్పుడన్నా గుర్తించాల్సిన సమయం వచ్చింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడిచిన స్వాతంత్య్ర పోరాటంలో దీనికి తగినంత ప్రాధాన్యత ఇవ్వబడలేదు. దేశ రాజకీయ దక్పథంలో ఎప్పుడూ నికరంగా కేంద్ర స్థానం వహిస్తూ, తీవ్రవాద శైలితో, సామాజిక అంశాలలో ఎటువంటి సర్దుబాటు ధోరణి ప్రదర్శించకుండా ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు అంబేడ్కర్. సమాజంలోని అసమానతలు, మతాలలో ఇమిడి ఉన్న అణచివేత ధోరణులు, సాంప్రదాయ వారసత్వాలు, మెజారిటీ సమాజం రుద్దిన విలువలను గమనించిన అంబేడ్కర్ సామాజిక, ఆర్థిక న్యాయం కోసం తన సొంత ఆదర్శాలను రచించుకున్నారు.

అంబేడ్కర్ రాజ్యాంగ సభలో, రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన కమిటీకి అధ్యక్షత వహించి, ప్రధాని నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌లో కొంతకాలం ఉన్నప్పటికీ, భారత రాజకీయాలలో కాంగ్రెసేతర, కాంగ్రెస్ వ్యతిరేక భావధారకు ఆయననే మనం ఆద్యుడిగా పరిగణించాలి. కానీ వాటికి భిన్నంగా హిందూ మితవాదం, రాజకీయంగా, సామాజికంగా బాగా పైచేయి సాధించి, మెజారిటీ మతమౌఢ్యం, సామాజిక అభివద్ధి నిరోధకత్వాలు సాగిస్తోన్న రాజకీయ, సిద్ధాంత ఎదురుదాడి ప్రస్తుత దేశపరిస్థితికి అద్దం పడుతున్నాయి. అంబేడ్కర్ వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి హిందూత్వవాదులు చరిత్ర సారాన్ని వక్రీకరించి మరీ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో కులవ్యవస్థపైనా, చాతుర్వర్ణ, సనాతన ధర్మాల పైనా, అంటరానితనాన్ని మార్పు లేకుండా యధాతథంగా నిలిపి ఉంచే సామాజిక దొంతరలపైనా హిందూ ధర్మశాస్త్రాల ఆధిపత్యం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలపై నేడు పోరాడాలి. ప్లాటో రిపబ్లిక్ ఏ కారణం వల్ల వైఫల్యాన్ని ఎదుర్కొందో, సరిగ్గా అదే కారణం మూలంగానే చాతుర్వర్ణ వ్యవస్థ కూడా తప్పని సామాజిక తిరుగుబాటుదారుడైన, ఈ పీడిత వర్గ మేధావి హెచ్చరించారు.

ఈ దుర్మార్గ వ్యవస్థ మూలంగా హిందువులలోని దిగువ వర్గాలు ప్రత్యక్షంగా కార్యాచరణలోకి దిగకుండా పూర్తిగా నిస్సహాయులుగా చేయబడ్డారని ఆయన వేలెత్తి చూపి ఇంతకంటే నీచమైన సామాజిక వ్యవస్థ మరొకటి రాబోదని హెచ్చరించారు. ఈ వ్యవస్థ ప్రజలను పరస్పర సహాయ కార్యకలాపాలు చేయనివ్వకుండా కుంటుపరిచి, వారిని నిస్సహాయులుగా, చచ్చుబడిన వారిలా చేస్తుందని తెలిపారు. ఆయన సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తూనే ఈ వ్యవస్థ రాజకీయ రంగంలో కలుగచేసే ప్రభావాలపై దృష్టి సారించి కృషి చేశారు. ధర్మశాస్త్రాలపై ఉన్న విశ్వాసాన్ని సర్వనాశనం చేయడం, వాటి పునాదిగా గల కులపరమైన నిరంకుశత్వాన్ని నాశనం చేయడమే దీనికి వాస్తవ పరిష్కారమని అంబేడ్కర్ భావించారు. ఇటువంటి విషయాలలో గాంధీ అర్ధ శతాబ్దానికి ముందే డాక్టర్ అంబేడ్కర్ హిందూ మతానికి ఓ సవాల్ అని ప్రకటించాడంటే అందులో ఆశ్చర్యమేమీలేదు. నిజంగానే ఆయన ఈనాటికీ ఒక సవాల్ గానే నిలిచి ఉన్నారు. అందువల్లనే హిందూత్వ వాదులు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూటమికి చెందిన కొన్ని శక్తులు నేడు ఆయనను నిర్లక్ష్యం చేయలేని స్థితిలో ఉన్నాయి.

సామాజిక పురోగతిని నిరోధించటానికి పూనుకున్న వారిని వ్యతిరేకిస్తూ, సామాజిక ఛాందసవాదం, అవకాశవాద రాజకీయాలపై యుద్ధాలు సాగిస్తూ 1940 దశకం చివరిలో, 1950 దశకం తొలిలో హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టే ప్రయత్నాలకు నాయకత్వం వహించారు. కానీ ఛాందసవాద శక్తులు ఆయన ప్రయత్నానికి వెన్నుపోటు పొడిచాయి. వారసత్వం, వంశపారంపర్య పాలననూ, ఏక పార్టీ వ్యవస్థను ఆయన ద్వేషించారు. ఒకే పార్టీ ప్రజామోదమైన ప్రభుత్వాన్ని నడపటం అంటే, నిరంకుశత్వం తెరవెనుక నుండి పాలన సాగించే ఒక రూపంగా ప్రజాస్వామ్యం తయారవ్వడాన్ని అనుమతించడమే అనేది అంబేడ్కర్ ప్రముఖ సూత్రీకరణల్లో ఒకటి. నిరంకుశత్వం ఎన్నికయినదయినప్పటికీ, అది నిరంకుశత్వం కాకమానదు. నిరంకుశత్వం కూలదోయబడే అవకాశం ఉండటం, దానిని తోక ముడిచేటట్లు చేయగల అవకాశం ఉండటం, దాని ప్రత్యర్ధి పార్టీ దాని స్థానంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండటమే నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిజమైన గ్యారంటీ అని ఆయన హెచ్చరించారు. ఏకపార్టీ పాలన ప్రాతిపదికన గానీ, లేదా నిద్రపోయే హక్కులని నిద్రపోనీ అనే సామాజికతత్వ ప్రాతిపదికతో ఉండే రాజకీయ సుస్థిరత గానీ అంబేడ్కర్‌కు గిట్టని విషయాలు. అంబేడ్కర్ దూరదృష్టితో వెలిబుచ్చిన రాజకీయ భావాలలో రెండు నేటి కాలానికి కూడా వర్తిస్తాయి. వాటిలో మొదటిది రాజకీయ స్వేచ్ఛలను ఒక గొప్ప వ్యక్తి పాదాల క్రింద ఉండనివ్వకండని, రెండోది రాజకీయాలలో భక్తి లేదా వీరాధన ఉంటే అది అధోపతనానికి దారి అని చెప్పారు. అందుకే రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా తీర్చిదిద్ది, వైరుధ్యాలను పరిష్కరించాలని లేకపోతే అవి ప్రజాస్వామ్య పునాదుల్ని నాశనం చేస్తాయని అంబేడ్కర్ ఆనాడే ప్రజాస్వామ్యాన్ని హెచ్చరించారు.

నాదెండ్ల శ్రీనివాస్- 9676407140

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News