బీజింగ్ : చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నా అపరిశుభ్ర వాతావరణంలోనే అక్కడి ఆహార మార్కెట్లలో పిల్లులు, కుక్కలు, గబ్బిలాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. చైనా ఆహార మార్కెట్లలో కబేళాలకు సిద్ధమైన మూగ జీవాలు వేలాడుతూ అదే అపరిశుభ్ర వాతావరణం రాజ్యమేలుతోంది. గబ్బిలాలు, ఇతర మూగజీవాల ద్వారా ఈ మహమ్మారి మానవులకు వ్యాపించిందన్న సమాచారంతో ఈ ఏడాది జనవరిలో చైనాలో ఆహార మార్కెట్ల (వెట్ మార్కెట్స్)ను మూసివేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వైరస్ను విజయవంతంగా నిరోధించగలిగామని చైనా ప్రకటించిన క్రమంలో మార్కెట్లు మళ్లీ ప్రారంభమయ్యాయి.
కరోనావైరస్కు ముందున్న స్ధితిలోనే మార్కెట్లు తిరిగి పనిచేస్తున్నాయని డైలీమెయిల్ పేర్కొంది. అయితే ఎవరినీ ఫోటోలు తీసుకునేందుకు గతంలో మాదిరిగా అనుమతించడం లేదని, ఫోటోలు తీసుకునే వారిని సెక్యూరిటీ గార్డులు అడ్డగించడం ఒక్కటే వ్యత్యాసమని తెలిపింది. ఇక ఆగ్నేయ చైనాలోని గిలిన్ నగరంలో అస్వస్థతలను నివారించేందుకు గబ్బిలాలు, పాములు, స్పైడర్లు ఇతర మూగజీవాలను తినాలంటూ సూచించే ప్రకటన బోర్డు దర్శనమిస్తోంది. చైనాలో పునఃప్రారంభమైన ఫుడ్ మార్కెట్లలో చైనా సంప్రదాయ ఆహారంపై సోషల్ మీడియాలోనూ ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి.