Tuesday, June 24, 2025

ఎన్నికల పోరు.. బెంగాల్ పార్టీల జోరు

- Advertisement -
- Advertisement -

పశ్చిమ బెంగాల్ 2026 లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. మతపరమైన ఉద్రిక్తతలు, అలజడుల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, మళ్లీ పునరుజ్జీవన దశలో ఉన్న వామపక్షాలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. బెంగాల్‌లో ఉపాధ్యాయుల సమ్మె, గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ పై చర్చ, కేంద్ర బిజెపి మంత్రుల ఉన్నత స్థాయి సమావేశాలు చర్చకు కీలకం కానున్నాయి. బెంగాల్‌లో భారీగా పుంజుకున్న బిజెపి గత పదేళ్లలో భారతీయ జనతా పార్టీ ఎంతో ఎదిగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో టిఎంసి ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ, బలమైనశక్తిగా అవతరించింది. 2014లో కేవలం 4.6% ఉన్న ఓట్ల వాటాను 2019 నాటి లోక్‌సభ ఎన్నికల నాటికి 40.7 శాతానికి పెంచుకోగలిగింది. 42 లోక్‌సభ స్థానాల్లో ఏకంగా 18 స్థానాలను గెలుచుకుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలను గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 2019 నుంచి బిజెపి పార్టీ స్థిరంగా మెరుగవుతోంది.

40 శాతంగా ఉన్న ఓటర్ల మద్దతును మరో 10% పెంచుకోవడం ద్వారా 2026 అసెంబ్లీ ఎన్నికలలో టిఎంసిని చిత్తుచేస్తుందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 2025లో అంచనా వేశారు. బిజెపి ఎదుగుదలకు ప్రధాన కారణం హిందూ ఓటర్లపై దృష్టి (Focus voters) పెట్టడం. మతపరమైన వ్యూహాలు అనుసరించడం, అలాగే బ్రాహ్మణులు, కాయస్థ వంటి అగ్ర వర్ణాలను, సనాతనీయులను ఆకట్టుకోవడం. 294 సీట్లు ఉన్న అసెంబ్లీలో మెజారిటీ సాధించాలంటే, 148 సీట్లు తప్పనిసరి. ప్రతిపక్ష నేత సువేందు అధికారి నేతృత్వంలోని పార్టీ 5% ఫార్ములా అనుసరిస్తూ, కీలకమైన ఓటర్ల శాతాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలోని 80 వేల పోలింగ్ బూత్‌లలో ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాలను మినహాయించి, 57 వేల పోలింగ్ బూత్‌లను లక్ష్యంగా పెట్టుకుని, అట్టడుగు స్థాయినుంచి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

అయితే బిజెపి బెంగాల్‌లో పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. సుకాంత మజుందార్, సువేందు అధికారి, దిలీప్ ఘోష్ వంటి కీలక నాయకుల మధ్య విభేదాలు, అంతర్గత పోరు పార్టీ ఐక్యతను బలహీనపరుస్తున్నాయి. టిఎంసిపై వచ్చిన స్కామ్ ఆరోపణలు, ఉపాధ్యాయ నియామక కుంభకోణం, దానికి వ్యతిరేకంగా ఎగసిన నిరసనలను బిజెపి పార్టీ తనకు అనుకూలంగా మరల్చుకోలేకపోయింది. 2024లో ఆర్‌జికర్ మెడికల్ కాలేజీలో డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై ప్రజలలో చెలరేగిన ఆగ్రహాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమైనందుకు విమర్శలపాలైంది. అంతే కాకుండా బిజెపి హిందూత్వ కథనం బెంగాల్‌లో సాంసృ్కతికంగా ఉన్న ఉదారవాద భద్రలోక్ పై ప్రభావం చూపలేకపోయింది. టిఎంసి సంక్షేమ పథకాలపట్ల ఆకర్షితులైన గ్రామీణ ఓటర్లను ఆకట్టుకోవడానికి కష్టపడుతోంది.

2016 స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకల వల్ల 2014 లో సుప్రీంకోర్టు దాదాపు 26 వేల పాఠశాల టీచర్ల ఉద్యోగాలను రద్దుచేయడంతో అశాంతి చెలరేగింది. మాజీ ఉపాధ్యాయుడు ప్రబీర్ కర్మాకర్ వంటి రిటైర్డ్ ఉపాధ్యాయులు కొత్తగా పరీక్షలు లేకుండా టీచర్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. కోల్‌కతాలో రాష్ట్ర సచివాలయానికి ర్యాలీగా వెళ్తున్న 50 మందికి పైగా టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అలజడి చెలరేగింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో టిఎంసి ప్రభుత్వంపై వ్యతిరేక చెలరేగింది. విద్యారంగాన్ని భ్రష్టుపట్టించిన స్కామ్‌కు నిరసనగా బిజెపి శాసన సభ్యులు 2025 జూన్‌లో అసెంబ్లీనుంచి వాకౌట్ చేసారు. అయితే దీనిని స్పీకర్ బిమన్ బెనర్జీ తప్పుపట్టారు. కేసు కోర్టులలో ఉన్న దృష్ట్యా సభలో చర్చించడం సాధ్యం కాదన్నారు.

సుప్రీం కోర్టు తీర్పు వల్ల ఇక్కట్ల పాలైన ఉపాధ్యాయులకు వ్యక్తిగత హోదాతో మద్దతు ఇస్తానని మమతా బెనర్జీ హామీ ఇచ్చినా, అశాంతి పూర్తిగా చల్లారలేదు. టీచర్ల ఆగ్రహాన్ని తనకు అనుకూలంగా మళ్లించడానికి బిజెపి ప్రయత్నించింది. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు టిఎంసి చేస్తున్న యత్నాలకు వ్యతిరేకంగా కోల్‌కతాలో నిరసనలు కూడా నిర్వహించింది. కానీ, దాని ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. కేంద్ర బిజెపి మంత్రులు, ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ల సమావేశం మరో ముఖ్య పరిణామం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సహా కేంద్ర బిజెపి మంత్రులు పార్టీ ప్రతిష్ఠను పెంచేందుకు ప్రవాస భారతీయ డాక్టర్ల (ఎన్‌ఆర్‌ఐలు) తో చర్చలు జరిపారు. 2025 జూన్‌లో అమిత్ షా కోల్‌కతా పర్యటనలో భాగంగా ఎన్నికల వ్యూహాలపై దృష్టిపెట్టారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్, సువేందు అధికారితో రహస్య సమావేశం నిర్వహించారు. ఎ

న్‌ఆర్‌ఐ డాక్టర్ల సమావేశం వివరాలు పెద్దగా తెలియకపోయినా, బిజెపి డయాస్పోరా వర్గాలకు చేరువకావడంలో ఇది కొంత సహాయపడుతుంది. అమిత్ షా పర్యటనలో మతపరమైన అంశాలను ప్రస్తావించారు. వక్ఫ్ చట్టం సవరణపై టిఎంసి వ్యతిరేక ఎంతవరకూ ప్రభావం చూపుతుందని ప్రశ్నించారు. 2026లో మమతా బెనర్జీ పార్టీని ఏ మేరకు అధికారం నుంచి తప్పించగలం అన్న అంశాన్ని అంచనా వేశారు. షా ప్రయత్నం హిందూ- ముస్లింల మధ్య అంతరాలను పెంచే బిజెపి వ్యూహాన్ని తేటతెల్లం చేస్తోంది. అయితే ఈ వ్యూహం ఎన్నికల్లో లాభించింది. కానీ బెంగాల్‌లోని టిఎంసికి కీలక ఓటు బ్యాంక్‌గా ఉన్న 27 శాతం ముస్లిం జనాభాను పూర్తిగా బిజెపికి దూరం చేసే ప్రమాదం ఉంది. డార్జిలింగ్ హిల్స్‌లలో ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం డిమాండ్ వివాదాస్పద అంశంగా నిలిచిపోయింది. బిజెపి గూర్ఖా జనముక్తి మోర్చా (జిజెఎం)కు మద్దతు ఇస్తూ 2009 నుంచి డార్జిలింగ్ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుంటోంది. కానీ, గూర్ఖాలాండ్‌ను అందించలేకపోయింది.

దీంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా 2020లో జిజెఎం నాయకుడు బిమల్ గురుంగ్ ఎన్‌డిఎ నుంచి వైదొలగి టిఎంసితో పొత్తుపెట్టుకున్నాడు. 2020 అక్టోబర్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గూర్ఖాలాండ్ సమస్యలపై త్రైపాక్షిక సమావేశాన్ని ఏర్పాటుకు సిద్ధమైంది. రాష్ట్రం ఏర్పాటు ప్రతిపాదనపై టిఎంసి అభ్యంతరం వ్యక్తం చేయడంతో జిటిఎపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో గూర్ఖా ఆకాంక్షలకు మద్దతు ఇచ్చి, తర్వాత వెనక్కి తగ్గడంతో బిజెపి విశ్వసనీయత కోల్పోయింది. ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం సాధ్యం కాదని దిలీప్ ఘోష్ 2020లో చేసిన ప్రకటన హిల్ ప్రాంతంలో ఓటర్లను బిజెపికి మరింత దూరం చేసింది. 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గూర్ఖాలు దూరం కావడం వల్ల బిజెపి ఉత్తర బెంగాల్‌లో తన పట్టుకోల్పోవచ్చు. గూర్ఖాలకు రాష్ట్ర హోదా కల్పిస్తే, బెంగాల్ మైదాన ప్రాంతాల ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. దీంతో బిజెపి ఈ అంశంపై జాగ్రత్తగా వ్యవహరించాలి.

2026 అసెంబ్లీ ఎన్నికలు బిజెపి, టిఎంసిలకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవి. 2021లో మొత్తం 294 స్థానాల్లో 213 స్థానాలను గెలుచుకున్న టిఎంసి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. గ్రామీణ ఓటర్లు ఆ పార్టీకి కంచుకోట. మహిళలను లక్ష్యంగా చేసుకుని మమత అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, ముస్ల్లిం ఓటు బ్యాంక్ టిఎంసికి మరింత అండగా నిలుస్తున్నాయి. 2025ఫిబ్రవరిలోనే మమతా బెనర్జీ “ఖేలా బర్ హోబే” (ఆట మళ్లీ మొదలవుతోంది) అన్న నినాదంతో తొలి ప్రచారం ఆరంభించారు. ఓటర్ల జాబితా రిగ్గింగ్ చేయడం ఎన్నికల్లో అక్రమాలకు బిజెపి పాల్పడుతుందని ఆరోపించారు. అయితే, ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ రేప్, హత్య, ఎస్‌ఎస్‌సి స్కామ్ వంటి అంశాల వల్ల పట్టణ ప్రజల్లో ఉన్న అసంతృప్తి టిఎంసికి సవాల్‌గా మారుతోంది. బెంగాల్‌లో బిజెపి సంస్థాగతంగా పలు సమస్యలను ఎదుర్కొంటోంది. బిజెపి తన 40% ఓట్లను పెంచుకొని టిఎంసిని అధిగమించడానికి కీలక మార్పు అవసరం.

అయితే, అంతర్గత కలహాలు, బెంగాలీ ఓటర్లతో సాంసృ్కతికపరమైన సంబంధాలు లేకపోవడం ఆ పార్టీకి అడ్డంకిగా మారాయి. వక్ఫ్ చట్ట సవరణతో 2025 ఏప్రిల్‌లో ముర్షిదాబాద్‌లో చెలరేగిన ఘర్షణలు, మతపరమైన అశాంతి, హిందూ ముస్లింల అంతరాన్ని తీవ్రతరం చేసింది.  ఇది టిఎంసి, బిజెపి రెండు పార్టీలకు కాస్త ప్రయోజనం చేకూరినా, చిన్న భాగస్వామ్య పార్టీలను దూరం చేసింది. 2011 వరకూ దాదాపు 34 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న సిపిఎం ఆధ్వర్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది. చారిత్రక భూ సంస్కరణలు, గ్రామీణ ప్రాంతాలలో వామపక్షాలపట్ల ఇంకా మద్దతు చెక్కుచెదరకుండానే ఉంది. ముఖ్యంగా టిఎంసి, బిజెపి ద్విముఖత్వంతో నిరాశ చెందిన యువత వామపక్షాలు వైపు చూస్తున్నాయి.

ముర్షిదాబాద్‌లో అశాంతి చెలరేగిన సమయంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలను సిపిఎం నాయకుడు మొహమ్మద్ సలీం ఖండించడంతో ఇప్పటి తాను లౌకిక ప్రత్యామ్నాయంగా నిలువగలనని లెఫ్ట్ ఫ్రంట్ వ్యూహాన్ని హైలైట్ చేస్తోంది. అయితే, 2011 నుంచి వామపక్షాల ఓటు శాతం తగ్గడం, కాంగ్రెస్ వంటి పార్టీలతో పొత్తుల వల్ల అంతంత ప్రయోజనం లేకపోవడంతో వామపక్షాల ఎన్నికల విజయావకాశాలు అనిశ్చితంగానే ఉన్నాయి. టిఎంసి సంక్షేమ పథకాలు ఆధిపత్యం చెలాయిస్తున్న గ్రామీణ ఓటర్లపై వామపక్షాలు పట్టు సాధించాలంటే వినూత్న వ్యూహాలు అవసరం. ఆర్‌జి కార్ సంఘటన తర్వాత ప్రజల నిరసనలకు వామపక్షాలు ఇచ్చిన మద్దతు వల్ల ప్రజలలో ఆకర్షణ పెరిగింది. ఇది భద్రలోక్‌లో బిజెపి లాభాలకు అడ్డుకట్ట వేయవచ్చు. పశ్చిమ బెంగాల్ రాజకీయ రంగం సంక్లిష్టమైన రణరంగం.

ఇక్కడ మతం, సాంసృ్కతిక, ఆర్థిక సమస్యలు కీలక పాత్ర వహిస్తాయి. మత రాజకీయాలు, సంస్థాగత ప్రయత్నాలు బిజెపికి ప్లస్ పాయింట్ అయినా, అంతర్గత కొట్లాటలు, సాంసృ్కతిక పరమైన సవాళ్ల వల్ల నష్టపోవలసి వస్తోంది. ఉపాధ్యాయుల సమ్మె, ఎస్‌ఎస్‌సి స్కామ్ వల్ల టిఎంసిపై వ్యతిరేకత పెరిగింది. అయితే, గ్రామీణ ప్రాంతాలలో మమతకు గల పట్టు, ముస్లింల మద్దతు ఆమెను ముందుండి నడిపిస్తున్నాయి. గూర్ఖాలాండ్ సమస్యల బిజెపికి రెండువైపులా పదును ఉన్న కత్తిలా మిగిలి పోయింది. అయితే వామపక్షాల పునరుజ్జీవనం టిఎంసి బిజెపి ద్వంద్వ వైఖరిని దెబ్బతీస్తుంది.2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ, ఈ అంశాల నేపథ్యంలో టిఎంసి తన ఆధిక్యతను నిలుపుకుంటుందా. బెంగాల్ గద్దెనెక్కాలన్న బిజెపి కల నిజమవుతుందా అన్నది కోటి డాలర్ల ప్రశ్న. వామపక్షాలు బలహీనంగా ఉన్నప్పటికీ గట్టి పోటీ ఇచ్చి ఫలితాలను సాధించడంలో కీలక పాత్ర పోషించవచ్చు.

  • గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)
  • (రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News