Tuesday, April 30, 2024

భారత్‌లో మస్క్ పర్యటన

- Advertisement -
- Advertisement -

 ప్రధాని మోడీతో భేటీ

న్యూఢిల్లీ: అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా సిఇఒ ఎలాన్ మస్క్ ఈ నెలాఖరున భారత్‌లో పర్యటించి, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన భారతదేశంలో కంపెనీ పెట్టుబడి ప్రణాళికపై ప్రకటన చేయనున్నారు. ఇండియాలో టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటును సహజమైన పురోగతిగా మస్క్ పేర్కొన్నారు. మస్క్‌తో పాటు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు ఏప్రిల్ 22న భారత్‌లో పర్యటించే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈ పర్యటనపై మస్క్‌ను ఇమెయిల్ ద్వారా ప్రశ్నించగా టెస్లా నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. గత సంవత్సరం (2023) జూన్‌లో మస్క్ మోడీతో సమావేశం కాగా, ఆ సందర్భంలో 2024లో భారత్‌లో పర్యటించనున్నామని, ప్లాంట్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని మస్క్ చెప్పారు. కొద్ది వారాల క్రితం భారత ప్రభుత్వం కొత్త ఇవి పాలసీని ప్రవేశపెట్టింది. దీని తర్వాత టెస్లా భారత్‌లోకి ప్రవేశంపై మార్గం సుగమం అయింది.

కొత్త ఇవి విధానంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే కంపెనీలకు పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. దీనివల్ల దేశంలో పారిశ్రామికోత్పత్తి పెరగడమే కాకుండా కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి. టెస్లాకు భారత్‌లో పలు రాష్ట్రాల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. టెస్లా తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్‌లు తమ తమ రాష్ట్రాల్లో ఫ్యాక్టరీని స్థాపించడానికి టెస్లాకు భూమిపై ఆకర్షణీయమైన ఆఫర్‌ల చేశాయని తెలుస్తోంది. టెస్లా బృందం గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుతో సహా అనేక రాష్ట్రాలను సందర్శించవచ్చని అనేక మీడియా నివేదికలు చెబుతన్నాయి.

అయితే ఇవి పాలసీలో 500 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టే కంపెనీలకు 5 సంవత్సరాల పాటు 15 శాతం కస్టమ్స్ సుంకం ప్రయోజనాన్ని అందించాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే వారు తమ ప్లాంట్‌ను 3 సంవత్సరాలలో ఏర్పాటు చేయాలి. అలాగే భారతదేశంలో తయారు చేసిన 25 శాతం విడి భాగాలను 3 సంవత్సరాల లోపు, 50 శాతం భాగాలను 5 సంవత్సరాలలోపు భారతదేశంలో ఉపయోగించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News