Friday, June 20, 2025

ప్రధాని మోడీ దౌత్యచాతుర్యం

- Advertisement -
- Advertisement -

కొన్ని నెలల నిశ్శబ్దం తరువాత ప్రధాని నరేంద్ర మోడీ కెనడాలో జి7 దేశాల సదస్సులో తన దౌత్య చాకచక్యాన్ని ప్రదర్శించి భారత్‌కు అనుకూలంగా రెండు అంశాలను తిరిగి సరిచేయగలిగారు. మొదటిది భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సయోధ్య తానే కుదిర్చి కాల్పుల విరమణ చేయించానని ట్రంప్ చేస్తున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయగలిగారు. రెండోది గత రెండేళ్లుగా భారత్ కెనడా దేశాల మధ్య దౌత్యసంబంధాల్లో ఏర్పడిన ప్రతిష్టంభనకు ముగింపు పలికారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జి7 సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు ట్రంప్‌తో దాదాపు 35 నిమిషాల పాటు ఫోన్‌లో సంభాషించారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో జాతీయ భద్రతా మండలి సమావేశంలో పాల్గొనడానికి ఒక రోజు ముందుగానే ట్రంప్ కననిస్కిస్ నుండి అమెరికాకు వెళ్లిపోయారు.

దీంతో మోడీ ట్రంప్ ముఖాముఖీగా కలుసుకుని చర్చించే అవకాశం లేకపోయింది. దాంతో మోడీ ఆయనతో టెలిఫోన్‌లో సంభాషించవలసి వచ్చిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. మే 710 తేదీల్లో పాకిస్తాన్ భారత్ మధ్య జరిగిన పరిణామాలే వారిమధ్య సంభాషణల్లో చోటు చేసుకున్నాయని మిస్రీ తెలిపారు. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ (Pakistan cease fire) లో మూడో వ్యక్తి మధ్యవర్తిత్వం ఏదీ లేదని, అలాగే ఇందులో వాణిజ్య ఒప్పందాల ప్రభావం కూడా లేదని, ఉభయ దేశాల మిలిటరీ నాయకత్వాల మధ్య అంగీకారం కుదిరిందని ట్రంప్‌కు మోడీ వివరించారు. పాకిస్తాన్ అభ్యర్థించడం వల్లనే భారత్ కాల్పులను ఆపగలిగిందని మోడీ వివరించారు. ఇక యుద్ధం ఆపకపోతే మీతో వాణిజ్యం ఆపేస్తానని భారత్‌ను ట్రంప్ బెదిరించారని వచ్చిన వార్తలపై కూడా మోడీ ట్రంప్‌నకు స్పష్టతనిచ్చారు.

ఇదంతా విన్నాక ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ సాగిస్తున్న పోరుకు ట్రంప్ మద్దతు పలికారు. ఈ పర్యవసానాల ఫలితంగానే ఇన్నాళ్లూ భారత్ పాకిస్తాన్ మధ్య తానే శాంతి ఒప్పందం కుదిర్చి, యుద్ధం ఆపగలిగానని బాహాటంగా చెప్పకొచ్చిన ట్రంప్ ఇప్పుడు ఆ రెండు దేశాలే తమకు తాము ఒప్పందం కుదుర్చుకున్నాయని, ఇందులో తన మధ్యవర్తిత్వం ఏదీ లేదని ప్రకటించడం గమనార్హం. ఈ టెలిఫోన్ సంభాషణలో చివర్లో మోడీని ట్రంప్ అమెరికాకు ఆహ్వానించారు. కెనడాలో జి7 శిఖరాగ్ర సదస్సు ముగిశాక తిరుగు ప్రయాణంలో అమెరికాకు వచ్చిపోవాలని మోడీని ట్రంప్ కోరారు. క్రొయేషియాలో పర్యటించాల్సి ఉన్నందున అమెరికాలో పర్యటించడం కుదరదని ట్రంప్‌నకు మోడీ సుతిమెత్తగా చెప్పి ట్రంప్ అభ్యర్థనను తిరస్కరించడం ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం. ఈ సందర్భంగా భారత్‌లో ఈ ఏడాది తరువాత జరగనున్న క్వాడ్ సదస్సుకు ట్రంప్‌ను మోడీ ఆహ్వానించడం కొసమెరుపు.

మోడీ జి7 సదస్సు అధ్యక్ష ఉపన్యాసంలో ట్రంప్ పేరు ప్రస్తావించకుండా బాధిత దేశానికి, ఉగ్రవాద దేశానికి కృత్రిమ సమానత్వాన్ని అమెరికా అధినేత ఆపాదించడాన్ని ఆక్షేపించారు. మోడీతో టెలిఫోన్ సంభాషణ తరువాత కూడా శ్వేతభవనం వద్ద మీడియాతో ప్రపంచం లోని దేశాల మధ్య సంఘర్షణలను నివారించే శాంతిదూతగా తనకు తాను ఆపాదించుకుంటూ యుద్ధాలను తాను ఆపగలిగానని ప్రస్తావించారు. ట్రంప్ యూటర్న్ అయినప్పటికీ, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ట్రంప్ వైఖరిపై విపక్షాలు తీవ్ర నిరసన తెలియజేసిన నేపథ్యంలో మోడీ తన వైఖరిని ట్రంప్‌కు గట్టిగా వివరించడంలో కృతకృత్యులయ్యారు. జి7 సదస్సు సందర్భంగా మోడీ చెప్పుకోదగిన కీలకమైన మరో అంశాన్ని సాధించగలిగారు. భారత్ కెనడా మధ్య గత రెండేళ్లుగా దౌత్యపరమైన ప్రతిష్టంభనకు ముగింపు పలికారు.

వీలైనంత త్వరలో భారత్, కెనడా దేశాల్లో పరస్పరంగా హైకమిషనర్లను తిరిగి నియమించుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. జస్టిన్ ట్రూడో వారసుడు మార్క్ కార్నీ జి7 సదస్సులో మోడీతో చర్చలు జరిపిన తరువాత ఉభయ దేశాల మధ్య దౌత్య విభేదాలను పరిష్కరించుకుని సంబంధాల పెంపునకు నిర్ణయించడం దౌత్యపరంగా విజయం సాధించినట్టే. ట్రంప్ టారిఫ్‌ల భారానికి కెనడా ఆర్థికంగా అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే.ఈ అంశం కూడా చర్చల్లో చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా కేంద్రంగా మారుతోందని భారత్ గత కొన్నాళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నా పట్టించుకోని కెనడా ప్రభుత్వంలో ఇప్పుడు మార్పు వచ్చింది. భారత్‌లో హింసను ప్రోత్సహించడానికి, దాడులు చేయడానికి అవసరమైన నిధులు సమకూర్చుకోడానికి ఖలిస్థానీ అతివాదులు కెనడాను తమ స్థావరంగా వినియోగించుకుంటున్నారని కెనడా ఒప్పుకోవడం విశేషం.

ఈ మేరకు కెనడా నిఘా సంస్థ నివేదిక వెల్లడించింది. భారత్ లోని పంజాబ్ ప్రాంతంలో ప్రత్యేక ఖలిస్థానీ దేశం తీసుకు రావాలని ఈ అతివాదులు కుట్రలు పన్నుతున్నారని ఆ నివేదిక హెచ్చరించింది. 2023 లో ఖలిస్థానీ వేర్పాటువాద నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య సంఘటనతో భారత్, కెనడా దేశాల మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని సాక్షాత్తు ఆనాటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోనే ఆరోపించడంతో దౌత్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. అయితే కెనడాలో కొత్తగా మార్క్ కార్నీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారత్‌తో దౌత్య సంబంధాలను తిరిగి పునరుద్ధరించుకోవాలని కెనడా ఆకాంక్షించింది. జి7 దేశాల కూటమిలో భారత్‌కు సభ్యత్వం లేకపోయినా భారత ప్రధాని మోడీని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రత్యేకించి ఆహ్వానించడం కీలక మలుపు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News