Thursday, May 2, 2024

కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన ఎర్ర శేఖర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఒక్కొక్కరుగా సీనియర్ నేతలు, మాజీ ఎంఎల్‌ఎలు ఆ పార్టీని వీడి.. బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంతో బలమైన నేతగా ఉన్న ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, ఆదివారం బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు మంత్రి కెటిఆర్ గులాబీ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వనించారు. ఎర్ర శేఖర్ చేరికతో పాలమూరులో బిఆర్‌ఎస్ మరింత బలోపేతం అవుతుందని కెటిఆర్ పేర్కొన్నారు.

ఉద్యమకాలం నుంచి కెసిఆర్‌తో అనుబంధం: ఎర్ర శేఖర్
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సిఎం కెసిఆర్ నాయకత్వంలో పని చేస్తానని ఎర్ర శేఖర్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్‌తో తనకు గొప్ప అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. గతంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్న కెసిఆర్‌తో కలిసి పనిచేసిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచేలా ఆత్మగౌరవంతో బతికేలా సిఎం కెసిఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని ఈ సందర్భంగా ఎర్ర శేఖర్ పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యంగా ముదిరాజులను ఆర్థికంగా స్థితి మంతులను చేసేందుకు చేపట్టిన కార్యక్రమాలను భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయేందుకు, కెసిఆర్ నాయకత్వంలో నడిచేందుకు బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పాలనలో ఒకప్పుడు దయనీయంగా ఉన్న ముదిరాజుల జీవితాలు ఈరోజు ప్రభుత్వం చేపట్టిన చేపల పంపిణీ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల వంటి కార్యక్రమాల వలన గుణాత్మక మార్పు వచ్చిందని, మత్స్య సంపద విపరీతంగా పెరిగిందని ఎర్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు బిసిల కోసం చేపట్టిన అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టడం పట్ల ఎర్రశేఖర్ కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News