Sunday, April 28, 2024

తొందర పడి నిర్ణయం తీసుకొవద్దు:ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మాజీ మంత్రి, బిజెపి నేత ఎ. చంద్రశేఖర్‌తో ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. కొంతకాలంగా చంద్రశేఖర్ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.. ఈ క్రమంలో వరంగల్ మోడీ పర్యటనకు ఆయన దూరంగా ఉండటం ఆయన పార్టీ మారుతున్నారనే అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన నివాసానికి వెళ్లిన ఈటల.. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు మంత్రిగా పని చేసిన తనకు ప్రధాని సభకు కనీసం పాస్ కూడా ఇవ్వలేదని, దళిత నాయకులపట్ల ఇంత వివక్ష చూపిస్తే బిజెపికి దళితులు ఓట్లెలా వేస్తారని చంద్రశేఖర్ ప్రశ్నించినట్లు తెలిసింది. బిజెపిలో ఎదురైన ఇబ్బందులను ఈటలకు చంద్రశేఖర్ వివరించారు. పార్టీలో చేరి రెండున్నర ఏళ్లయినా ఎలాంటి పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. చంద్రశేఖర్, తాను తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశామని, తమకు ఉమ్మడి ఎజెండా ఉందన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం కలిసి పనిచేస్తామన్నారు. వరంగల్ రీజియన్ వరకే ప్రధాని మోడీ మీటింగ్ జరిగిందని.. అందువల్లే చంద్రశేఖర్‌కు పాస్ రాలేదన్నారు. అంతే తప్ప మరొకటి కాదన్నారు. ఎస్‌సి ఏ, బి, సి,డి వర్గీకరణకు బిజెపి కమిట్‌మెంట్ తో ఉంది. అధిష్టానం చర్చలు జరుపుతాం. కర్ణాటకలో హామీ ఇచ్చాం.. తెలంగాణలో కూడా వర్గీకరణకు కృషి చేస్తామని ఈటల వెల్లడించారు. పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదన్నారు. పార్టీ బాగుండాలని ఈ భేటీలో చర్చ చేసినట్లు మాజీ మంత్రి చంద్రశేఖర్ చెప్పారు. పార్టీని ఎలా బాగుచేయాలో చెప్పానన్నారు. తెలంగాణ ఉద్యమంలో పదవులకు రాజీనామా చేసి కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నాం. తెలంగాణ బాగుపడాలని మేము చర్చించాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News