గత ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎఫ్ 2’ మూవీ సూపర్ హిట్ అయింది. ఆ సమయంలోనే సీక్వెల్ను చేయాలని నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనీల్ రావిపూడి నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనీల్ రావిపూడి వెంటనే ‘ఎఫ్ 3’ సినిమాను పట్టాలెక్కించాలని భావించినా కూడా కరోనా కారణంగా సాధ్యం కాలేదు. చివరికి గురువారం ‘ఎఫ్ 3’ సినిమా పూజా కార్యక్రమాలు, షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేశ్, వరుణ్తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెల 23 నుండి రెగ్యులర్ షూటింగ్కు వెళ్లబోతున్నట్లుగా ఈ సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లు అరవింద్ హాజరయ్యారు. ముహూర్తం షాట్కు వరుణ్ తేజ్, తమన్నాలపై అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా… ఫైనాన్షియర్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత దిల్రాజు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు దిల్రాజు, శిరీష్ మాట్లాడుతూ “ఎఫ్ 2 మూవీ ప్రేక్షకులను ఎలా నవ్వించిందో… దానికి మరింత ఫన్ను జతచేసి ‘ఎఫ్ 3’ కథను సిద్ధం చేశాడు దర్శకుడు అనీల్ రావిపూడి. వెంకటేశ్, వరుణ్తేజ్, తమన్నా, మెహ్రీన్లు మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నారు. ఈనెల 23 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం”అని అన్నారు. దర్శకుడు అనీల్ రావిపూడి మాట్లాడుతూ “ఎఫ్ 3 చిత్రానికి అద్భుతమైన కథ కుదిరింది. మరోసారి వెంకటేశ్, వరుణ్తేజ్, తమన్నా, మెహ్రీన్లు మరోసారి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతారు”అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః సాయి శ్రీరామ్, సంగీతంః దేవిశ్రీప్రసాద్, ఆర్ట్ః ఎ.ఎస్.ప్రకాశ్, ఎడిటింగ్ః తమ్మిరాజు, రచనా సహకారంః ఎస్.కృష్ణ, ఆడిషన్ స్క్రీన్ప్లేః ఆది నారాయణ, నారా ప్రవీణ్.