గత నెల 22వ తేదీన జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఘటనకు ప్రతీకారంగా ఈ నెల 7వ తేదీన భారత్ ఆపరేషన్ సింధూర్ని(Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్థాన్లోని 9 ఉగ్రవాద(Terrorists) స్థావరాలపై మిసైల్స్తో దాడి చేసింది భారత్. అయితే తాజాగా ఈ దాడిలో మృతి చెందిన ఐదుగురు ప్రధాన ఉగ్రవాదుల వివరాలను వెల్లడించారు. హతమైన ఉగ్రవాదుల్లో ముగ్గురు జైషే మహమద్కు చెందిన అగ్రనేతలు కాగా, ఇద్దరు లష్కరే తొయిబాకు చెందిన అగ్రనేతలు.
జైషే మహమ్మద్ ఉగ్రవాద(Terrorists) సంస్థ స్థాపకుడు మసూద్ అజార్ ఇద్దరు బావమరుదులు ఈ దాడిలో చనిపోయారు. పెద్ద బావమరిది హఫీజ్ మహమ్మద్ జమీల్, మరో బావమరిది మహమ్మద్ యూసఫ్ అజార్ హతమయ్యారు. ఈ ఆపరేషన్లో(Operation Sindoor) జైషే మహమ్మద్కు చెందిన మహమ్మద్ హసన్ ఖాన్ కూడా చనిపోయాడు. లష్కరే తొయిబాకు చెందిన ముదస్సర్ ఖదాయిన్ ఖాస్ ఈ దాడిలో హతమయ్యాడు. అతనికి పాకిస్థాన్ ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. లష్కరే తొయిబాకు చెందిన మరో అగ్రనేత ఖలీద్ కూడా ఈ దాడిలో హతమయ్యాడు.