Thursday, May 2, 2024

గుజరాత్ వర్శిటీలో నమాజు గొడవ.. విదేశీ విద్యార్థులపై దాడి

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: స్థానిక గుజరాత్ యూనివర్శిటీ హాస్టల్‌లో నమాజ్ చేస్తున్న విదేశీ విద్యార్థులను ఓ గుంపు వచ్చి చితకబాదింది. ఈ క్రమంలో ఇద్దరు విద్యార్థులు తీవ్రగాయాల పాలయ్యి ఆసుపత్రిలో చికిత్సకు చేరారు. ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ఆదివారం తెలిపాయి. పలు దేశాలకు చెందిన విద్యార్థులు రంజాన్ నెల నేపథ్యంలో హాస్టల్ ఏ బ్లాక్‌లో శనివారం రాత్రి నమాజుకు దిగారు.

విషయం తెలుసుకుని ఓ గుంపు అక్కడికి దూసుకువచ్చిందని, వీరి దాడిలో శ్రీలంక విద్యార్థి ఒకడు. తజికిస్థాన్ విద్యార్థి ఒకడు తీవ్రంగా గాయపడ్డట్లు వెల్లడైంది. కాగా అక్కడి సిసి కెమెరాలు , ఇతరత్రా ఆధారాల మేరకు దాడికి పాల్పడ్డ వారిని గుర్తించినట్లు, ఇప్పటికీ ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడిలో మొత్తం పాతిక మంది వరకూ పాల్గొన్నట్లు నిర్థారించారు. వీరిపై కేసులు నమోదు అయ్యాయి. హాస్టల్ గదులలో నమాజులు కుదరవని అక్కడికి చేరిన గుంపు తెలిపింది. ఏదైనా ఉంటే మసీదుకు వెళ్లవచ్చునని పేర్కొంది. ఈ క్రమంలో దాడి జరిగిందని స్థానిక పోలీసు కమిషనర్ జిఎస్ మాలిక్ తెలిపారు.

ఘటనపై వెంటనే రాష్ట్ర హోం సహాయ మంత్రి హర్ష సంఘవి స్పందించారు. ఉన్నత స్థాయి పోలీసు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయంలో సరైన విధంగా చట్టపరమైన చర్యలకు ఆదేశించారు. ఈ వర్శిటీలో దాదాపు 300 మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది ఎ బ్లాక్‌లో ఉంటున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్లు వర్శిటీ ఉపకులపతి నీరజ్ గుప్తా తెలిపారు.పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నామని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా తొమ్మిది పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని పోలీసు కమిషనర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News