Sunday, April 28, 2024

గుజరాత్ వర్శిటీ ఘటన అధికారులతో కేంద్రం సమీక్ష

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్‌లోని గుజరాత్ వర్శిటీలో విదేశీ విద్యార్థులపై దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. వెంటనే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ ఉండాలని , దాడికి దిగిన వారిని అదుపులోకి తీసుకోవాలని కేంద్రం గుజరాత్ ప్రభుత్వానికి సూచించింది. ఇప్పటికే గుజరాత్ హోం శాఖ సహాయ మంత్రి హర్ష సంఘావీ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు. హాస్టల్ గదిలో కొందరు విద్యార్థులు నమాజుకు దిగిన విషయం తెలియగానే ఓ మూక వచ్చి వీరిపై దాడికి దిగడం క్రమేపీ వివాదానికి దారితీసింది. కాగా తాము ఎప్పటికప్పుడు గుజరాత్ ప్రభుత్వంతో దీనిపై చర్చిస్తున్నామని, వివిధ దేశాలకు చెందిన విద్యార్థులపై దాడికి దిగిన వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుందని ఈ క్రమంలోనే కేంద్రం తరఫున విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. దాడి ఘటనలో మొత్తం ఐదుగురు విద్యార్థులు గాయపడగా ఇద్దరిని చికిత్సకు ఆసుపత్రికి తరలించారు.

క్యాంపస్‌లో మసీదు లేనందునే రూంలో నమాజులు
క్యాంపస్‌లో కానీ సమీపంలో కానీ తమకు అందుబాటులో మసీదు లేకపోవడం వల్లనే తప్పనిసరిగా తాము ఉంటున్న రూంల్లోనే నమాజు జరిపినట్లు విదేశీ విద్యార్థులు అధికారులకు తెలిపారు. అల్లరి మూక వచ్చి తమను కొట్టిందని, లాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లను ధ్వంసం చేసిందని, అక్కడున్న సెక్యూరిటీ గార్డు కూడా ఏమీ చేయలేకపోయ్యాడని వారు వెల్లడించారు. దాడిలో ఆఫ్రిక విద్యార్థులు కూడా గాయపడ్డారు. అల్లరిమూకలు కర్రలు రాడ్లతో వచ్చారని వీరు తెలిపారు. తమంతా ఇప్పుడు భయభ్రాంతులమయ్యామని , ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియకుండా ఉందని వాపొయ్యారు. ఘటనపై హైదరాబాద్ ఎంపి అసదుద్దిన్ ఒవైసీ స్పందించారు. ఈ చర్యను ఖండిస్తున్నట్లు తెలిపారు. వెంటనే ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవల్సి ఉందన్నారు. ముస్లింలంటేనే ఈ విధంగా వ్యవహరించే ధోరణి అనుచితం అని సామాజిక మాధ్యమంలో స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News