Sunday, April 28, 2024

నలుగురు మొస్సాద్ ఏజెంట్లకు ఇరాన్‌లో మరణ శిక్ష

- Advertisement -
- Advertisement -

టెహ్రాన్ : ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేయడమే కాక, ఇరాన్ లోని ఇస్ఫాహాన్‌లో బాంబుదాడులు చేయడానికి కుట్ర పన్నారన్న నేరంపై మొసాద్ సంస్థకు చెందిన నలుగురికి సోమవారం ఇరాన్‌లో మరణ శిక్ష విధించారు. మహమ్మద్ పరమార్థి, మొహసీన్ మజ్జమ్, వాఫా అజర్బార్, పిజ్‌మన్ ఫతేహ్ అనే ఈ నలుగురిని ఏడాదిన్నర క్రితం మొసాద్ సంస్థ నియమించుకుని, ఆఫ్రికా దేశాలకు తరలించింది.

అక్కడ సైనిక కేంద్రాల్లో ఇజ్రాయెల్ అధికారుల పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చారు. వీరు ఇరాన్ దేశ రక్షణ విభాగానికి చెందిన కీలక ప్రదేశాలను దెబ్బతీయడానికి ప్రయత్నించినట్టు ఇరాన్ కోర్టు నిర్ధారించింది. ఇరాన్ ఇస్ఫాహాన్ ప్రావిన్స్ లోని ఓ స్థావరంలో కుట్రకు ప్రయత్నించారన్న ఆరోపణలపై 2022 లో వీరిని అరెస్ట్ చేశారు. 2023 సెప్టెంబర్‌లో ఈ నలుగురికి మరణ శిక్ష విధించినట్టు న్యాయశాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

గత ఏడాది ఆగస్టులో తమ బాలిస్టిక్ క్షిపణి ప్రాజెక్టును ధ్వంసం చేయడానికి మొసాద్ పన్నిన కుట్రను భగ్నం చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. అంతకు ముందు ఫిబ్రవరిలో ఇస్సాహాన్ లోని తమ సైనిక స్థావరంపై ఇజ్రాయెల్ డ్రోన్‌తో దాడి చేసిందని ఇరాన్ ఆరోపించింది. బ్రిటన్‌తో కలిసి గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇటీవలనే రక్షణ శాఖ మాజీ ఉద్యోగి అలీరెజా అక్బరీకి ఇరాన్ మరణ శిక్ష విధించింది. డిసెంబర్‌లో కూడా ఒక మొసాద్ ఏజెంట్‌ను జెహెదాన్‌లో ఉరి తీసినట్టు ఇరాన్ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News