ఒక్కరోజే రూ.752
రూ.40 వేలు దాటిన 10 గ్రాముల బంగారం ధర
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు, డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడడం వంటి కారణాలతో బంగారం ధరలు అనూహ్యంగా పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజే పసిడి ధర రూ.752 పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ.40,652కు చేరుకుంది. గురువారం పసిడి ధర రూ.39,900 (10 గ్రాములు)గా ఉంది. పసిడి బాటలోనే వెండి పయనించింది. కిలో వెండి ధర కూడా ఒక్క రోజులోనే రూ.960 పెరిగింది. దీంతో కిలో వెండి రేటు రూ.48,870కు చేరగా, అంతకుముందు ట్రేడింగ్ రోజు ఈ ధర రూ.47,910గా ఉంది. కాగా దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారిగా బంగారం పది గ్రాములకు రూ .720 పెరిగి రూ.41,070 కు చేరుకుంది. అమెరికా దాడిలో ఇరాన్ కమాండర్ మరణించిన తర్వాత పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి.
యుఎస్ దాడి తర్వాత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ముడి చమురు ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ‘అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి బలహీనపడడంతో ఢిల్లీ 24 క్యారెట్ పసిడి ధర రూ.40,652కు చేరింది’ అని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ హెడ్ అడ్వైజరీ దేవర్ష్ వాకిల్ అన్నారు. గ్లోబల్ మార్కెట్లో బంగారం, వెండి రెండింటి ధరలు పైపైకి ఎగశాయి. ఔన్స్ పసిడి ధర రూ.1547కు చేరగా, ఔన్స్ వెండి ధర రూ.18.20 వద్ద ఉంది. ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగితే ప్రపంచ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ 1,575 డాలర్లకు చేరుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు.