Sunday, April 28, 2024

వంద రోజుల కోసం ఆగుతున్నం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా వంద రోజులు కూడా కాలేదని ఆగుతున్నామని, లేకపోతే హామీల అమలుపై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్లమని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ అగ్రనాయకులు, ఎంఎల్‌ఎ టి.హరీశ్‌రావు పే ర్కొన్నారు. కొన్ని రోజులైతే బిఆర్‌ఎస్ నేతలు ఇంట్లో కూర్చున్నా, రండి రండి అని ప్రజలే బయటకు తీసుకువస్తారని అన్నారు. కర్నాటకలో ఐదు గ్యారంటీల తో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని విమర్శించారు. ఐదు గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని కర్నాటక ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి మొన్న మీడియాతో చెప్పారని, గ్యారంటీలు అమలు చేస్తే కర్ణాటక ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలుతుందని ఆయన హెచ్చరించారని  అన్నారు.

మన దగ్గర కూడా కాంగ్రెస్ నేతలు గ్యారంటీల చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన నాగర్‌కర్నూల్ లోక్‌సభ సన్నాహక సమావేశంలో మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి,మధుసూదనాచారి, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్,వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజు, బిఆర్‌ఎస్ నాయకులు నాగం జనార్ధన్‌రెడ్డి, ఇతర నాయకలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి హరీశ్‌రావు ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు కావాలని పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల 90 వేల కోట్లేనని, అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అంతకుమించిన హామీలిచ్చిందని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ఇష్టమొచ్చిన విధంగా హామీలతో ప్రజలను మభ్యపెట్టి ఇపుడు వాటి గురించి అడిగితే కాకమ్మ కథలు చెబుతున్నారని ఆక్షేపించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలుపే తెలంగాణ సమస్యలకి పరిష్కారం
డిల్లీలో ఎవరున్నా.. గల్లీలో ఎవరున్నా పార్లమెంట్‌లో తెలంగాణ గొంతు వినిపించే బిఆర్‌ఎస్ ఎంపిలే ఉండాలని హరీశ్‌రావు అన్నారు. కేంద్ర మంత్రి అయ్యాక కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారు..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిస్తేనే వాళ్లు ఇచ్చిన హామీలు అమలవుతాయని చెప్పారు. ఢిల్లీ నుంచి తెలంగాణకు ఏదీ రావాలన్నా బిఆర్‌ఎస్ ఒత్తిడితోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నాగర్ కర్నూల్‌లో కార్యకర్తలు కష్టపడి, బిఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలుపే తెలంగాణ సమస్యలకి పరిష్కారమని అన్నారు. విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని, ఈ కీలక సమయంలో బిఆర్‌ఎస్ ఎంపిలు ఢిల్లీలో లేకపోతే తెలంగాణకు నష్టమని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం చేతులెత్తేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 111వ హామీ కింద పాలమూరుకు జాతీయ హోదా తెస్తామని చెప్పిందని, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేది పోయి కాంగ్రెస్ నాయకులు, ఢిల్లీలో ప్రతి రోజూ బిజెపి నాయకుల మెడలకు దండలు వేస్తున్నారని మండిపడ్డారు.

వార్తల్లో ఉండేందుకు బండి సంజయ్ లొట్టపిట్టలా తాపత్రయ పడతారు
కాంగ్రెస్,బిజెపి మైత్రిని బండి సంజయ్ బహిరంగంగా ఒప్పుకున్నారని, కెసిఆర్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎలను కొంటారని ఈ బ్రహ్మజ్ఞాని సెలవిస్తున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర, పలు ప్రాంతీయ పార్టీలను చీల్చిన చరిత్ర బిజెపిదేనని బండి సంజయ్ చెబుతున్నారని అన్నారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన బిజెపి బ్రోకర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని హరీశ్‌రావు గుర్తు చేశారు. బండి సంజయ్ వార్తల్లో ఉండేందుకు లొట్టపిట్టలా తాపత్రయ పడతారని అన్నారు.బండి సంజయ్ తీరు పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌కు ఒక్క రూపాయి తేనోడు అడ్డమైన విషయాలు అడ్డం పొడువు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం ప్రకటించి బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేతలు నిజాలు మాట్లాడటం అలవాటు చేసుకోవాలి
నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలంగాణ ఆర్థిక ప్రగతిని గొప్పగా పొగిడిందని అన్నారు. నీతి ఆయోగ్ నివేదికతోనైనా కాంగ్రెస్ నేతలు నిజాలు మాట్లాడటం అలవాటు చేసుకోవాలని సూచించారు. దావోస్‌కు వెళ్లిన సిఎం బృందం రాష్ట్రం అప్పుల్లో ఉంది.. పెట్టుబడులకు రావొద్దని చెప్పదలుచుకుందా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. దావోస్ వెళ్లడం అంటే ఖర్చు దండగ అని ప్రతిపక్షంలో ఉండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారని, దీనిపై ఇప్పుడేమంటారని నిలదీశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ హత్యరాజకీయాలు మొదలుపెడుతోందని, ఇది మంచిది కాదని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే పని చేస్తుంది
ఎన్నికల ఫలితాలు వచ్చి నేటికి 45 రోజులవుతోందని, ఓటమి నుంచి తేరుకుని నెల రోజులకే సమీక్ష ,సన్నాహక సమావేశాలు ప్రారంభించామని హరీశ్‌రావు అన్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని సమావేశాల్లో ఊహించిన దాని కన్నా ఎక్కువగా విలువైన సూచనలు వచ్చాయని తెలిపారు. కార్యకర్తలు ఏది కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో అదే జరుగుతుందని, పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే పని చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్లు తండ్లాడామని, అయినా అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డామని చెప్పారు. బిఆర్‌ఎస్ పార్టీ స్థానం మారిందని, పాలన నుంచి ప్రతిపక్షానికి వచ్చాం ..అయినా అధైర్య పడాల్సిన అవసరం లేదని అన్నారు. మనం ఉద్యమానికి ఊపిరి లూదిన వాళ్లం…పేగులు తేగే దాకా మన మాతృ భూమి కోసం కొట్లాడిన వాళ్లం ..మనకు సత్తువ ఉంది ..సత్తా ఉంది

..ప్రతిపక్షంలో కూడా మన మట్టి మనుషుల ఆకాంక్షల కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాడుదామని బిఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడానికి బలమైన కారణాలు ఉండనక్కర్లేదని, ఈ సోషల్ మీడియా దుష్ప్రచారాల కాలంలో ప్రభుత్వం మారడానికి ప్రజలకు పనికొచ్చే అంశాలు కూడా ఉండనక్కర్లేదని పేర్కొన్నారు. రాజస్థాన్‌లో ఐదేళ్లకే ప్రభుత్వం మారితే,ఛత్తీస్‌ఘడ్‌లో కూడా ఐదేళ్లకే మారిందని, ఇలా ప్రభుత్వాలు మారడం దేశంలో కొత్తేమి కాదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో వరసగా పదేళ్లు పాలించిన సందర్భాలు చాలా అరుదు అని, ఐదేళ్లలోపే ప్రజావ్యతిరేకతను మూట గట్టుకుని ఇంటికి పోయిన కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ దేశంలో ఎక్కువ అని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా కెసిఆర్ తెలంగాణను అభివృద్ధి చేశారని, ఇది ఎవరూ కాదనలేని సత్యమని వ్యాఖ్యానించారు. సాంప్రదాయ రాజకీయ పద్ధతులకు కెసిఆర్ దూరంగా ఉన్నారని, ఆ విధానం కొంత నష్టం చేసిందన్న భావన కార్యకర్తల్లో ఉందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠంగా నేర్చుకుని ముందుకు సాగుదామని, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదామని హరీశ్‌రావు అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News