అమరావతి: బంగ్లాదేశ్ చెందిన వ్యక్తి హోంగార్డును రైల్లోంచి తోసేయడంతో అతడు మృతి చెందిన సంఘటన ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అలెప్పీ నుంచి ధనాబాద్ వెళ్తున్న బోకారో ఎక్స్ప్రెస్ లో తునికి సమీపంలో బంగ్లాదేశ్కు చెందిన అబీబ్ అనే వ్యక్తి తోటి ప్రయణికులతో గొడవకు దిగాడు. ప్రయాణికుల భయబ్రాంతులకు గురి చేస్తుండడంతో విధులు ముగించుకొని అదే ట్రైన్లో వెళ్తున్న హోంగార్డు సూర్యవెంకట శివకు ప్రయాణికులు సమాచారం ఇచ్చారు. అబీబ్ను నిలువరించేందుకు వెళ్లిన హోంగార్డుతో గొడవకు దిగడమే కాకుండా రైల్లోంచి బయటకు నెట్టేశాడు. దీంతో హోంగార్డు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బోగోలో ఉన్న ప్రయాణికుల సమాచారం మేరకు రైల్వే పోలీసులు, జిల్లా ఎస్పి నయిబ్ ఆస్మి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి అబీబ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శివకు 2018లో వివాహం జరిగింది. ప్రస్తుతం అతడి భార్య నిండు గర్భిణీగా ఉంది.