జవహర్నగర్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం భారీ దొంగతనం జరిగింది. కుటుంబ సభ్యులంతా దైవదర్శనం కోసం దేవాలయానికి వెళ్లితే ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. యాప్రాల్ మైత్రి ఎన్క్లేవ్లో నివసించే దారం నర్సింగ్రావు వృత్తి రిత్యా రేషన్ డీలర్. ఇటివల తమ బందువులు చనిపోతే దైవర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి డిసెంబర్ 30వ తేది యాదాద్రిగుట్ట దేవాలయానికి వెళ్లారు. ఇదే అదనుగా చూసిన దొంగలు సోమవారం రాత్రి ఇంటి వెనుక డోర్ పగులగొట్టి ఇంటిలోకి ప్రవేశించారు. ఇంట్లోని 50 తులాల బంగారం, 5 కిలోల వెండి, 60వేల నగదును దోచుకెళ్లారు.
దొంగలు ఇంట్లోని టీవిని పగులగొట్టడమే కాక పలు వస్తువులను చిందరవదంగా చేశారు. ఉదయం కాలనీ అధ్యక్షుడికి సమాచారం అందటంతో ఆయన ఇంటిని పరిశీలించి యజమానికి సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న జవహర్నగర్ ఇన్స్పెక్టర్ బిక్షపతిరావు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకోని వివరాలు సేకరించాడు. సంఘటన స్థలానికి మల్కాజిగిరి డిసిపి రక్షితామూర్తి వచ్చి పరిశీలించారు. పోలీసులు క్లూస్టీం సిబ్బందిని రప్పించి ఆధారాలు సేకరించారు. డాగ్స్క్వాడ్ను రప్పించి తనిఖీలు చేపట్టారు.సిసి కెమోరాలను పరిశీలించి తగిన ఆధారాలను సేకరిస్తామని ఆమె తెలిపారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బిక్షపతిరావు తెలిపారు. దొంగతనం జరిగిన విధానం చూస్తే ఇంట్లో పని చేసే వ్యక్తులు లేదా నర్సింగ్రావుకు దగ్గరి వ్యక్తులే ఈ దొంగతనంకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.