జెఎల్ఎల్ సిటీ మూమెంటమ్ ఇండెక్స్-2020 రిపోర్టు వెల్లడి
హైదరాబాద్: అమెరికా, దుబాయ్ వంటి దేశాలలోని సిటిలను తలదన్ని ప్రపంచలోనే మోస్ట్ డైనమిక్(క్రియాశీల) సిటిగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు జెఎల్ఎల్ సిటి మోమెంటమ్ ఇండెక్స్ 2020 రిపోర్ట్లో వెల్లడించింది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 130 సిటిలలో నిర్వహించిన సర్వేలో టాప్ 20లో భారత్లోని ఏడు పట్టణాలు చోటు దక్కించుకున్నాయి.
అందులో హైదరాబాద్కు తొలిస్థానం దక్కగా, ఆ తరువాత రెండో స్థానంలో బెంగళూరు, ఐదో స్థానంలో చెన్నై, ఆరో స్థానంలో ఢిల్లీ, 12వ స్థానంలో పూణె, 16వ స్థానంలో కోల్కతా, 20వ స్థానంలో ముంబయి నిలిచాయి. వృద్ధిరేటు, ఎయిర్ కనెక్టివిటీ (ప్యాసింజర్స్), రిటైల్ సేల్స్, పెట్టుబడులు, అద్దెలు, రియల్ ఎస్టేట్లో పారదర్శకత, కార్పొరేట్ ప్రజెన్స్, అక్యుపయర్ డిమాండ్, ఇంజన్ రూమ్ పాపులేషన్ వంటి విభాగాల్లో జరిపిన అధ్యయనంలో హైదరాబాద్ టాప్ ప్లేస్లో నిలవడం విశేషం.
సిటి మూమెంటమ్ ఇండెక్స్ 2020 రిపోర్ట్ని బంజరాహిల్స్లోని తాజ్ దక్కన్ హోటల్లో శనివారం రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ బొంతు రామ్మోహన్, ఐటీ సెక్రెటరీ జయేష్ రంజన్, జెఎల్ఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత మూడేళ్ళలో హైదరాబాద్ రెండు సార్లు నెంబర్ వన్ ప్లేస్ లో ఉండటం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ కి ఎయిర్ కనెక్టివిటీ టాప్ ప్లేస్లో నిలువడానికి ప్రధాన కారణమన్నారు.
అలాగే టాప్ కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ అన్ని ఇక్కడే ఉన్నాయని, హైదరాబాద్ని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికే సామాన్యులకు నివాసయోగ్యమైన ఇళ్ళు, మౌలిక సదుపాయాలు, తక్కువ జీవన వ్యయంతో పాటు ఆధునిక వసతులు కలిగిన బహుళ అంతస్తుల భవనాలతో నగరం ప్రపంచ స్థాయికి ఎదుగుతోంది. విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు శాంతియుతంగా కలసిమెలసి జీవించే ఇక్కడి ప్రజల జీవనశైలి ప్రశంసలు పొందుతోంది. ప్రపంచ స్థాయిలో వివిధ నగరాల్లో ఉన్న విలాసవంతమైన జీవన ప్రమాణాలతో ఇక్కడి ప్రజలు గడుపుతున్నట్లు అంతకు ముందు ఏడాది విడుదల చేసిన అధ్యయన నివేదికలో జెఎల్ఎల్ పేర్కొంది.
ఐటి అండ్ రియల్ బూమ్
నగరం నిర్మాణ రంగంలో పురోగతి సాధిస్తుండగా, అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీలతో విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తూ దూసుకుపోతోంది. ప్రపంచంలో ఖ్యాతిగాంచిన మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ తదితర సంస్థలు హైదరాబాద్లో నెలకొల్పడం ఒక రికార్డుగా నిలిచింది. వీటితో పాటు దేశ, విదేశాలకు చెందిన దాదాపు 700లకుపైగా ఐటి కంపెనీలు ఐదు లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించి దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా నిలిచింది.
ఐటి రంగం గణనీయంగా విస్తృతం అవడంతో నగర అభివృద్ధి కూడా అదే స్థాయిలో పురోగమిస్తోంది. ప్రజల ఆదాయ, వ్యయాలకు తగ్గట్టుగా భారీ మాల్స్, లగ్జరీకార్లు, విల్లాలు భారీగా పెరిగాయి. ఆర్థిక లావాదేవీలు, జనాభా పెరగడంతో రెసిడెన్షియల్, కమర్షియల్ కాంప్లెక్స్లకు మంచి డిమాండ్ వచ్చింది. ఏటా 6 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో బిల్డింగ్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు విస్తృతం అవుతున్నాయి.