Sunday, April 28, 2024

కెసిఆర్ అసెంబ్లీకొస్తే ఇక చెడుగుడే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కెసిఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండడమే కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకరమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు పేర్కొన్నారు. ‘సిఎం’ అనే రెండక్షరాల కన్నా కెసిఆర్ అనే మూడు అక్షరాలే పవర్‌ఫుల్ అని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరిలో కెసిఆర్ ప్రజల మ ధ్యకు వస్తారని వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఖమ్మం లోక్‌సభ సన్నాహక సమావేశానికి బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కడియం శ్రీహరి, పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎంపి నామా నాగేశ్వర్‌రావు,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి కెటిఆర్ ప్రసంగించారు. పార్లమెంట్ ని యోజకవర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయని కెటిఆర్ వెల్లడించారు. త్వరలోనే రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ రెండు, మూడు నెలలకోసారి అన్ని కమిటీలతో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. అధికారంలో ఉ న్నప్పటి కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలమని, మనమంతా ఉ ద్యమంలో గట్టిగా పోరాడిన వాళ్లమేనని కెటిఅర్ గుర్తుచేశారు. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో పా ర్టీ పోరాట పటిమను ప్రజలంతా చూశారని, రా నున్న రోజుల్లో కెసిఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉం టుందో ఊహించుకోవాలని అన్నారు. స్వల్పకాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతమని, గత చరిత్రను పరిశీలిస్తే అర్థమయ్యేది అదేనని పేర్కొన్నారు. ఇప్పటిలాగే 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపిని తిరస్కరించి కాంగ్రెస్ గెలిపించిన ప్రజలు కేవలం ఏడాదిన్నర స్వల్పకాలంలోనే కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసాన్ని కోల్పోయారని తెలిపారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అనంతరం జరిగిన నాటి లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యిందని, ఆ ఎన్నికల్లో అదే ప్రజలు టిడిపిని తిరిగి భారీ మెజారిటీతో గెలిపించారని, ఈ వాస్తవాన్ని, చరిత్రను మనం మరువగూడదని పేర్కొన్నారు.

వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ కాంగ్రెస్‌కు ఉండదు
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉండదని కెటిఆర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి నెలదాటిందని, వచ్చిన తెల్లారినించే వాగ్దానాలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో కాలాయపన దిశగా అడుగులేస్తున్నదని విమర్శించారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ నెల రోజుల పాలనా పోకడలే సాక్ష్యం అని పేర్కొన్నారు. వాగ్దానం చేసిన దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం పట్ల ప్రజల్లో అసహనం ప్రారంభమైందని చెప్పారు. ఇది ఇలాగే కొనసాగే పరిస్థితి ఉన్నదని అన్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడితెస్తూ తెలంగాణ ప్రజలకోసం బిఆర్‌ఎస్ పార్టీ పోరాడుతుందన్నారు. ఈ దిశగా మనందరం కార్యోన్ముఖులం కావాల్సివుంటుందని కెటిఅర్ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.
కారణాలు సమీక్షించుకుని ముందుకు సాగుదాం
ఖమ్మం వంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదు అనడానికి మనం సాధించిన అసెంబ్లీ ఫలితాలే నిదర్శనమని కెటిఆర్ పేర్కొన్నారు. 39 ఎంఎల్‌ఎ సీట్లు గెలవడంతో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీతో చేజారిపోయాయని అన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకుని సమీక్షించుకుని ముందుకు సాగుదామని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన సమావేశాల్లో పార్టీ పరంగా ఆత్మవిమర్శ చేసుకుంటున్నామని చెప్పారు.
తెలంగాణ గళం.. తెలంగాణ బలం బిఆర్‌ఎస్సే
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు రాజకీయ అస్తిత్వంగా నిలిచిన బిఆర్‌ఎస్ పార్టీ కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణను గెలిపించిందని కెటిఆర్ పేర్కొన్నారు. పదేండ్ల అనతికాలంలోనే బిఆర్‌ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెట్టిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ గళం.. తెలంగాణ బలం బిఆర్‌ఎస్సే అని పేర్కొన్నారు. రాబోయే ప్రతి అడుగులో కెసిఆర్ దళంగా ఐకమత్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించిన ఘనతను ప్రతిష్టను వెలుగొందుదుతున్న ప్రభకు ఏమాత్రం భంగం కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నిబద్దత కలిగిన బిఆర్‌ఎస్ శ్రేణులదే అని స్పష్టం చేశారు. నాడు తెలంగాణ సాధించుకున్న ఉద్యమ స్పూర్తితో, నిన్నటిదాకా సాధించిన ప్రగతిని తిరిగి నిలబెట్టుకుందామని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీని గెలిపించుకుందామని కెటిఆర్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News