పోచెఫ్స్ట్రూమ్(దక్షిణాఫ్రికా): అండర్-19 వన్డే ప్రపంచకప్ లో భాగంగా సెన్వెస్ పార్క్ వేదికగా జరిగిన సెమీస్ లో పాకిస్తాన్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 173 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఒక వికెట్ కూడా కోల్పోకుండా విజయ ఢంకా మోగించింది. దీంతో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. భారత్ ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్(105) సెంచరీతో చెలరేగగా, దివ్యాన్ష్ సక్సెనా(59) అర్థసెంచరీతో మెరివడంతో టీమిండియా 35.2 ఓవర్లలో వికెట్ కోల్పకుండా 176 పరుగులు చేసి అద్భుత విజయం సాధించింది. దీంతో భారత్ మరోసారి ఫైనల్ కు దూసుకుపోయింది. ఇక, గురువారం న్యూజిలాండ్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన విజేతతో భారత్ ఫైనల్ లో తలపడనుంది.
అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ కు ఆదిలోనే బారత్ షాక్ ఇచ్చింది. కట్టుదిట్టమైన బంతులతో చెలరేగిన టీమిండియా బౌలర్లు పాక్ బ్యాట్స్ మెన్స్ కు చుక్కలు చూపించారు. దీంతో పాక్ బ్యాట్స్ మెన్స్ క్రీజులో నిలవలేక వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. పాక్ ఓపెనర్ హైదర్ అలీ(56), రోహెల్ నజీర్(62)లు మాత్రమే అర్థసెంచరీలతో రాణించారు. మిగతా ఆటగాళ్ళంతా ఘోరంగా విఫలమయ్యారు. దీంతో పాక్ జట్టు 43.1 ఓవర్లలో 172 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో శుషాంత్ మిశ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్ రవి బిష్ణ్నాయ్, కార్తిక్ త్యాగిలు చెరో రెండు వికెట్లు, అధర్వ, యశస్వీ జైశ్వాల్ లు తలో వికెట్ తీశారు.
IND U19 win Semifinal match against PAK U19