రిషబ్ పంత్ సెంచరీ, భారత్ 471 ఆలౌట్
లీడ్స్: భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ దీటైనా జవాబిస్తోంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 113 ఓవర్లలో 471 పరుగులకు ఆలౌటైంది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ కడపటి వార్తలు అందే వరకు 47 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అంతకుముందు 359/3 ఓవర్నైట్ స్కోరుతో శనివారం రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అండగా నిలిచారు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు.
గిల్ సమన్వయంతో ఆడగా రిషబ్ పంత్ చెలరేగి బ్యాటింగ్ చేశాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ఆతిథ్య జట్టు బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. 65 పరుగుల స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ చేపట్టిన పంత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో స్కోరును పరిగెత్తించాడు. అతన్ని కట్టడి చేసేందుకు ఇంగ్లీష్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదే క్రమంలో షోయబ్ బషీర్ బౌలింగ్లో అద్భుత సిక్స్ను కొట్టి పంత్ సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన శుభ్మన్ గిల్ 227 బంతుల్లో 19 ఫోర్లు, ఒక సిక్స్తో 147 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇదే క్రమంలో పంత్తో కలిసి నాలుగో వికెట్కు 209 పరుగులు జోడించాడు.
తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ నిరాశ పరిచాడు. 8 ఏళ్ల తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న నాయర్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. 4 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఆ వెంటనే రిషబ్ పంత్ కూడా వెనుదిరిగాడు. 178 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 134 పరుగులు చేసిన పంత్ను జోష్ టంగ్ వెనక్కి పంపాడు. శార్దూల్ ఠాకూర్ (1), బుమ్రా (0), ప్రసిద్ధ్ కృష్ణ (1), రవీంద్ర జడేజా(11) పరుగులు చేసి ఔటయ్యారు. భారత్ చివరి 7 వికెట్లను 41 పరుగుల తేడాతో కోల్పోవడం గమనార్హం. ఇంగ్లండ్ బౌలర్లలో టంగ్, స్టోక్స్ నాలుగేసి వికెట్లను పడగొట్టారు.