Friday, May 3, 2024

గిన్నిస్ బుక్ లో చోటు దక్కేలా వజ్రోత్సవ వేడుకలు: వేముల

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి

మహనీయులను స్మరించుకుంటూ… భారత కీర్తిని ప్రపంచానికి చాటాలి

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Independence Diamond Jubilee celebrations

నిజామాబాద్: దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు తెలంగాణలోని ప్రతి ఒక్కరు వజ్రోత్సవ వేడుకల్లో భాగస్వాములై దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని వనమహోత్సవంలో భాగంగా రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలోని ఫ్రీడమ్ పార్క్ లో మొక్కలు నాటారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో కలిసి “ఫ్రీడమ్ పార్క్” లో ఏక కాలంలో 750 మొక్కలు నాటారు. త్రివర్ణ పతాకాలను చేతబట్టుకుని, దేశభక్తి నినాదాలు ఇస్తూ స్థానికులు ఉత్సాహంగా వనమహోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు.  ప్రజలందరిలో జాతీయతా భావాన్ని పెంపొందించేలా తెలంగాణ ప్రభుత్వం పక్షం రోజుల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఇందులో భాగంగానే వనమహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలు నాటామన్నారు. స్వాతంత్ర్య దినోత్సవమైన పంద్రాగస్టు రోజున తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలని సూచించారు. రాష్ట్రంలో సుమారు కోటీ 20 లక్షల నివాసాలు ఉన్నాయని, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కే అవకాశం ఉందని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు అందించేందుకు అనేక మంది త్యాగధనులు కృషి చేశారని, వారి త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ప్రతి ఒక్కరు జాతీయత భావాన్ని పెంపొందించుకుని దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్, డిఆర్డిఒ చందర్, డిపిఒ జయసుధ, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News