Thursday, May 2, 2024

నిజ్జర్ హత్యపై దర్యాప్తుకు భారత్ వ్యతిరేకం కాదు..

- Advertisement -
- Advertisement -

లండన్: కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటువాద నేత హర్‌దీప్‌సింగ్‌నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ భారత వైఖరిని స్పష్టం చేశారు.

నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలు తాము తోసిపుచ్చడం లేదన్నారు. అలాగే కెనడా దర్యాప్తును కూడా తాము వ్యతిరేకించడం లేదని తెలిపారు. అయితే ఈ వాదనలకు అనుగుణంగా బలమైన సాక్షాలు తమ ముందుంచాలని ఆయన స్పష్టం చేశారు. “హౌ ఎ బిలియన్ పీపుల్ సీ ది వరల్డ్ ” అనే శీర్షికతో ప్రముఖ జర్నలిస్ట్ లియోనెల్ బార్బర్‌తో జరిగిన సంభాషణ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తన ఆరోపణలకు మద్దతు ఇచ్చే ఎలాంటి ఆధారాలను భారత్‌తో కెనడా పంచుకోలేదని పేర్కొన్నారు. కెనడాలో ఖలిస్థాన్ అనుకూల కార్యకలాపాలను ప్రస్తావిస్తూ వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ ఒక నిర్దిష్టమైన బాధ్యతతో కూడుకున్నవని, రాజకీయ ప్రయోజనాల కోసం ఆ స్వేచ్ఛలను దుర్వినియోగం చేయడం చాలా తప్పుగా జైశంకర్ వ్యాఖ్యానించారు.

ఈ విషయమై కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు. కెనడా లోని భారత హైకమీషన్‌పై ఖలిస్థాన్ సానుభూతిపరుల దాడులు, దౌత్యవేత్తలపై స్మోక్ బాంబు దాడులను ఆయన ప్రస్తావిస్తూ ఈ సంఘటనలతో భారతీయ దౌత్యవేత్తలు భయాందోళనలకు గురయ్యారని, దీనికి బాధ్యులైన వారిపై కెనడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News