దుబాయ్ : భారత ప్రభుత్వం నూతన పౌరసత్వ చట్టాన్ని ఎందుకు తీసుకువచ్చిందనేది అర్థం కావడం లేదని బంగ్లాదేశ్ ప్రధాని షేక్హసీనా చెప్పారు. సిఎఎ, ఎన్ఆర్సిలు అనవసర ప్రక్రియలని తేల్చివేశారు. అయితే ఇవి భారతదేశ అంతర్గత విషయాలని హసీనా స్పష్టం చేశారు. అబూధాబికి వచ్చిన ప్రధాని గల్ఫ్న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా భారతదేశంలో తీసుకువచ్చిన నూతన పౌరచట్టం విషయం ప్రస్తావనకు వచ్చింది. సిఎఎ, ఎన్ఆర్సిలపై భారతదేశంలో నిరసనలు వ్యక్తం కావడం, కొన్ని రాష్ట్రాలు దీనిని అమలు చేయడం లేదని ప్రకటించిన నేపథ్యంలో బంగ్లాదేశ్ నేత స్పందన వెలువడింది. ప్రస్తుతం భారత్లో నెలకొన్న పరిస్థితుల వల్ల బంగ్లాదేశ్కు భారత్ నుంచి వలసలు ఉంటాయని తాము అనుకోవడం లేదని ఆమె చెప్పారు.
అయితే ఈ ప్రక్రియలపై ఇండియాలో పలు సమస్యలు తలెత్తడంతో సహజంగానే పొరుగుదేశాలపై ప్రభావం పడుతుందని అన్నారు. ఏ అంశంపై అయినా అనిశ్చితి ఏర్పడితే, అది చిక్కులకు దారితీస్తుందని, ఏది ఏమైనా ప్రస్తుత చట్టం, ఇతర ప్రక్రియలు భారతదేశ ఆంతరంగిక విషయాలని హసీనా తేల్చిచెప్పారు. అదే విధంగా తమ దేశంలో మతపరమైన వేధింపులతో భారతదేశానికి వలసలు జరగలేదని, ఈ విషయంలో వెలువడే వార్తలను ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. భారత్, బంగ్లాదేశ్ల మధ్య ప్రస్తుతం చాలా బాగుందని, విస్తృత రంగాల విభిన్న కోణాలలో వీటికి ఎటువంటి ముప్పు లేదన్నారు.