మనతెలంగాణ/హైదరాబాద్: అమరావతి ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు, దాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదని, అసెంబ్లీని ముట్టడించి రాజధాని వాణి ప్రభుత్వానికి బలంగా వినిపించాలని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.అసెంబ్లీ లోపల తాను పోరాడతానని, బయట రైతులు పోరాడాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని నిరోధించి అమరావతిని కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. రాజధానిపై అంకితభావంతో 29వేల మంది రైతులు 33వేల ఎకరాల భూములిచ్చారని.. ఇప్పుడు రాజధానిని మారిస్తే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇదిలావుండగా సోమవారం నాడు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని గుంటూరు రేంజ్ ఐజి వినీత్ బ్రిజ్ లాల్ తెలిపారు. రాజధాని ప్రాంతంలో పోలీసు చట్టం-30, 144 సెక్షన్ నిషేధాజ్ఞలు అమలులో ఉన్నట్లు ఆయన వివరించారు.
రాజధాని ప్రాంతంలోని గ్రామాల ప్రజలు కొత్త వారిని ఎవరినీ తమ నివాస ప్రాంతాల్లో ఉండటానికి అనుమతించవద్దని స్పష్టం చేశారు. వారు ఏదైనా చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడితే ఆశ్రయం ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ముట్టడి కార్యక్రమానికి వచ్చే వారికి వాహనాలు, ఇతర సౌకర్యాలు సమకూరిస్తే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఐజితెలిపారు. ఏ ఒక్క ఆందోళనకారుడు ఆ ప్రాంతంలోకి చొరబడకుండా అసెంబ్లీ చుట్టుపక్కల భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. నిరసనకారుల ముసుగులో అసాంఘిక శక్తులు చొరబడే అవకాశాలు ఉండటంతో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. చెక్ పోస్టుల వద్ద పోలీసు పహరా పెంచాలని, తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు.
Section 144 imposed in Amaravathi