స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్ బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్కి అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు శుక్రవారం పూర్తయ్యాయి. ‘యు/ఎ’ సర్టిఫికెట్ లభించింది.
చిత్రం విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో నిర్మాతలు మాట్లాడుతూ “అల వైకుంఠపురంలో సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన అన్ని పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. పాటలు ఇంతటి ప్రాచుర్యం పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని జనవరి 6న హైదరాబాద్ యూసుఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో ‘అల వైకుంఠపురంలో… మ్యూజికల్ ఫెస్టివల్’ను వైభవంగా, వినూత్నంగా నిర్వహిస్తాం”అని తెలిపారు.
అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష తదితరులు ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కెమెరామెన్ః పి.ఎస్.వినోద్, సంగీతం: తమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్, -లక్ష్మణ్.