మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ విడుదలై సోమవారంతో 47 ఏళ్లు పూర్తి చేసుకుంది. కొణిదెల శివశంకర వరప్రసాద్ను చిరంజీవిగా ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈ చిత్రంతో నటుడిగా ఆయన తన కెరీర్ను ప్రారంభించి మెగాస్టార్గా ఎదిగారు. ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. “22 సెప్టెంబర్ 1978… ‘కొణిదెల శివ శంకర వరప్రసాద్’ అనబడే నేను ‘ప్రాణం ఖరీదు చిత్రం ద్వారా ’చిరంజీవిగా’ మీకు పరిచయం అయ్యి సోమవారంతో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి.
ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా, ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే… అందుకు కారణం నిస్వార్ధమైన మీ ‘ప్రేమ’. ఈ 47 ఏళ్ళలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావి కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను”అని చిరంజీవి అన్నారు.
Also Read : కాల్మొక్తా… ఒక్క బస్తా ఇప్పించండి