బాలాకోట్ దాడుల గురించి అర్నాబ్కు ముందే తెలుసంటున్న రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: అధికారిక రహస్యాలను ప్రభుత్వంలోనివారు ఓ జర్నలిస్ట్కు తెలియజేయడం నేరపూరిత చర్య అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శించారు. పాకిస్థాన్ బాలాకోట్లోని ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం జరపనున్న దాడుల గురించి రిపబ్లిక్ టివి ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్గోస్వామి వాట్సాప్ సంభాషణల్లో ముందే మాట్లాడటమంటే అత్యంత రహస్యమైన ఆ సమాచారాన్ని ప్రభుత్వంలోని ఎవరో ఒకరు లీక్ చేసినట్టేనని రాహుల్ స్పష్టం చేశారు. వాట్సాప్ ద్వారా జరిగిన ఆ సంభాషణ పాకిస్థాన్కు కూడా తెలిసే ఉంటుందని, అది నేరపూరిత చర్య అని రాహుల్ అన్నారు.
వైమానిక దాడులులాంటివి ప్రధాని, రక్షణ, హోం మంత్రులతోపాటు ఎయిర్ఫోర్స్ చీఫ్, జాతీయ భద్రతా సలహాదారుకు మాత్రమే తెలిసి ఉండే అత్యంత రహస్య అంశమని రాహుల్ అన్నారు. ఈ ఐదుగురిలో ఎవరో ఒకరు లీక్ చేయకుండా ఇతరులకు తెలిసే అవకాశం లేదని రాహుల్ స్పష్టం చేశారు. ప్రధానికి తెలియకుండా ఇలాంటి సమాచారాన్ని ఎవరూ లీక్ చేసే అవకాశంలేదని రాహుల్ అన్నారు. అత్యంత రహస్యమైన ఈ సమాచారాన్ని ఇచ్చినవారు, తీసుకున్నవారు నేరస్థులేనని రాహుల్ అన్నారు. 2019, ఫిబ్రవరి 26న బాలాకోట్లోని ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.