అందుకే నిర్భయ కేసు దోషుల ఉరికి
పవన్ను ఎంపిక చేసుకున్న తీహార్ జైలు అధికారులు
న్యూఢిల్లీ: ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో మరణ శిక్ష పడిన నలుగురు దోషులను ఉరి తీయడానికి మీరట్కు చెందిన తలారి పవన్ జల్లాద్ను తీహార్ జైలు అధికారులు ఎంచుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం పవన్ జల్లాద్ ఉరి కంబాలను, జైలు పరిసరాలను పరిశీలించడం కోసం శుక్రవారం మీరట్ జైలుకు చేరుకున్నాడు. నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు దోషులకు ఈ నెల 22న ఉరి శిక్షను అమలు చేయాలంటూ ఢిల్లీ కోర్టు ఇటీవల డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉరి శిక్షను అమలు చేయడానికి పవన్ జల్లాద్ సేవలను ఉపయోగించుకోవాలని తిహార్ జైలు అధికారులు భావిస్తున్నారు. ఈ పని కోసం తాము పవన్ జల్లాద్ను ఎంచుకోవాలని భావిస్తున్నామని వారు యుపి ప్రభుత్వానికి లేఖ రాశారు కూడా.
అయితే తిహార్ జైలు అధికారులు ఈ పనికి పవన్ను ఎంచుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయని జైలు వర్గాలు అంటున్నాయి. వీటిలో మొట్టమొదటి దిపవన్ జల్లాద్ తలారి కుటుంబంనుంచి వచ్చిన వ్యక్తి అయినందున ఉరి అమలు చేయడంలో ఎలాంటి తప్పులు జరిగేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉండడం.ఇక అతను శారీరకంగా బలిష్టంగా ఉండడం, కంటి చూపుకూడా నిబంధనలకు అనుగుణంగా ఉండడం రెండో కారణం. కాగా ఉరి తీయనున్న పవన్కోసం ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారన్నది మాత్రం రహస్యంగానే ఉంది. ‘ఢిల్లీ కోర్టు ఆదేశాలను దోషులకు ఇచ్చాం. డెత్ వారంట్ మాత్రం అధికారుల వద్దే ఉంది. దోషులకు ఇచ్చిన ఆర్డర్ కాపీలో డెత్ వారంట్ ప్రస్తావన ఉంది’ అనిఢిల్లీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ చెప్పారు. పవన్ కూడా తన కర్తవ్య నిర్వహణకోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తున్నాడు.
‘ చాలా నెలలుగా నేను ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను.. చివరికి భగవంతుడు నా ప్రార్థన విన్నాడు’ అని తిహార్ జైలు అధికారులు తన సేవలను కోరిన విషయం తెలిసిన వెంటనే పవన్ వ్యాఖ్యానించాడు. కాన్షీరామ్ ఆవాస్ యోజన కింద మీరట్ జిల్లా అధికారులు తనకు ఇచ్చిన ఒక గది ఇంట్లో పవన్ ఉంటున్నాడు. మీరట్లోని భుమియాపల్ ప్రాంతంలో ఉన్న జల్లాద్ (తలారు)ల కుటుంబం లక్ష్మణ్ కుమార్ కుటుంబానికి చెందిన నాలుగో తరం వ్యక్తి పవన్. ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో మరణ శిక్ష పడిన దోషులు ముకేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ సింగ్, పవన్ గుప్త్తాలను ఈ నెల 22వతేదీ ఉదయం 7 గంటలకు ఉరి తీయనున్న విషయం తెలిసిందే.