Thursday, August 7, 2025

అది కాళేశ్వరం రిపోర్ట్ కాదు…కాంగ్రెస్ నివేదిక:జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఘోష్ కమిషన్ పేరిట విడుదల చేసిన నివేదిక కాళేశ్వరం రిపోర్ట్ కాదని.. అది కాంగ్రెస్ రిపోర్ట్ అని, బిజెపి, కాంగ్రెస్, ఎపి సిఎం చంద్రబాబు ప్రోద్భలంతో తయారుచేసిన రిపోర్టు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎంఎల్‌ఎ గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆత్మకూర్ ఎస్ మండలంలో రేషన్ కార్డులు, ఇండ్ల నిర్మాణాలకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. బనకచర్ల కోసమే కాళేశ్వరంను పండబెట్టారని, ఇది ముమ్మాటికీ చంద్రబాబు కుట్రే అని వ్యాఖ్యానించారు. రెండేళ్లుగా చెప్పిందే చెప్పి, కెసిఆర్‌పై ఏడుపు తప్ప ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. ప్రధాని మోడీ, ఎపి సిఎం చంద్రబాబు డైరెక్షన్లో కెసిఆర్‌ను బదనాం చేయాలని కుట్రలు చేస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా గులాబీ బాస్‌ను ఏమీచేయలేరన్నారు. కెసిఆర్ ముందుచూపు పాలనే నేడు తెలంగాణ అద్భుత ఫలితాలు సాధిస్తోందని అన్నారు.

కాళేశ్వరమే ఎప్పటికైనా తెలంగాణకు జీవధార అన్నారు. కెసిఆర్‌కు మరింత పేరొస్తదనే కాంగ్రెస్ విషం కక్కుతోందని, కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలతో ఇంకాకాలం వెళ్లబుచ్చుతోందని మండిపడ్డారు. తానే స్వయంగా వెళ్లొచ్చి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చానని, మొన్నటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో తమ పార్టీ అగ్ర నేత హరీశ్‌రావు నిజాలన్నీ చెప్పారని అన్నారు. అయినా కూడా కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గుండాలని అన్నారు. వరుస మోసాలతో కాంగ్రెస్ రికార్డులు సృష్టిస్తోందని, ఇవన్నీ స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్లో భాగమే అన్నారు. బిసిలను వాడుకొని మోసం చేసేందుకే రిజర్వేషన్ డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమంలో కెసిఆర్‌ను మించినోడే లేడన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ జంతర్ మంతర్ నాటకం కూడా బిసిలను మోసం చేసేందుకే అని, రేవంత్ ఎప్పటికీ మోడీ, చంద్రబాబు చేతిలో కీలుబొమ్మే అని అన్నారు.

తెలంగాణ నీళ్లను బనకచర్ల రూపంలో ఆంధ్రకు దోచిపెట్టే కుట్ర చేస్తున్నారని, ఇప్పటికే అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ఎప్పటికైనా తెలంగాణకు కెసిఆరే శ్రీరామరక్ష అని అన్నారు. ఇకనైనా బిఆర్‌ఎస్‌పై ఏడుపు మాని అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పి మాజీ వైస్ ఛైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు తూడి నరసింహారావు, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ కొనతం సత్యనారాయణ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News