- Advertisement -
భూ పంపిణీలో భాగంగా గత ప్రభుత్వాలు పేద చెంచు రైతులకు పంచిన భూములపై పట్టాలు మంజూరు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ కు చెందిన చెంచు రైతులు శనివారం ప్రజా భవన్ భవన్లో మంత్రి సీతక్కను కలిసి తమ ఆవేదన తెలియజేశారు. 27 మంది రైతులకు 1988లో కడ్తాల్ మండలంలోని అనుమాన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలో 54 ఎకరాలను అప్పటి ప్రభుత్వం కేటాయించిందని మంత్రి దృష్టికి తెచ్చారు. అయితే ధరణి వల్ల ఆ భూములపై తాము పట్టాలు కోల్పోయామని ఆవేదన వెలిబుచ్చిన చెంచు రైతులు 30 ఏళ్లుగా సేద్యం చేసుకుంటున్న భూములపై తమకు పట్టాలు ఇప్పించాలని మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తికి స్పందించిన మంత్రి వెంటనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫోన్ చేసి వీరందరికి న్యాయం చేయాలని ఆదేశించారు.
- Advertisement -